Saturday, April 4, 2020

Dasakumar Charitra దశకుమార చరిత్ర.

 దశకుమార చరిత్ర.
         - - - - - - - - - - - - - - -
డా.హరి శివకుమార్ గారి సిద్ధాంత గ్రంథము "కేతన - ఆయన కృతులు."

శ్రీ మాలఘటిక కేతన గారు దండిమహాకవి సంస్కృతమున రచించిన దశకుమార చరిత్రను అనువదించినారు. దానిని శ్రీ కొట్టరువు తిక్కనగారికి అంకిత మిచ్చినారు.

ఆయన  ప్రప్రథమముగ "ఆంధ్ర భాషా భూషణము" అను పేరున తెలుగు భాషలో వ్యాకరణమును రచించి, ఆంధ్రభాషా వ్యాకరణ రచయితలకు మార్గదర్శకులయ్యారు.

శ్రీ కేతన గారు ధర్మశాస్త్రములందలి ప్రీతితో యాజ్ఞవల్క్య స్మృతిని అనువదించి, విజ్ఞానేశ్వరుని వ్యాఖ్య మీద గల గౌరవముతో తన గ్రంథమునకు ఆ పేరే పెట్టుకున్నారు.

శ్రీ కేతన గ్రంథములను అధ్యయనాంశముగా స్వీకరించి తమ సిద్ధాంత గ్రంథమును పైన పేర్కొన్న మూడు ముఖ్య భాగములుగా విభజించి మనకు అందించారు డా శివకుమార్ గారు. ప్రస్తుత చర్చనీయాంశము ఆ పరిశోధనా గ్రంథములోని ప్రథమ అధ్యాయము. అది "దశ కుమార చరిత్రము. "

శ్రీ కేతనార్యులవారు తమ అనువాదములో మూల రచయిత శ్రీ దండిమహాకవికి ఎంతో న్యాయము చేసినారని డా.హరి శివకుమార్ గారు తెలియజేసినారు. అనువాదకుని యొక్క స్వతంత్రమైన బుద్ధి వైభవము ఆయన రచనలో ద్యోతకమగుచున్నదని భావించినారు.

డా.శివకుమార్ గారు తమ పరిశోధన గ్రంథములోని ప్రథమ భాగమైన "దశ కుమార చరిత్రము" ను -

1. కథాకావ్య ప్రక్రియా వివేచనము,
2.దండి - దశ కుమార చరిత్ర,
3. దశకుమార చరిత్రము - అనువాద పద్థతి,
4.దశకుమార చరిత్రము - పాత్ర చిత్రణము,
5.దశ కుమార చరిత్రము - రస భావములు,
6.దశ కుమార చరిత్రము - వర్ణనములు,
7.కేతన కవితా శక్తి,
8.కేతన రచనా పాటవము
9.ఆంధ్ర కథా కావ్యములు - దశ కుమార చరిత్రము -

అను తొమ్మిది అధ్యాయములుగా విభజించినారు.

మార్గ కవిత్వము, దేశి కవిత్వములలో మార్గ కవిత్వమునకు పెద్ద పీట వేసిన శ్రీ తిక్కన సోమయాజులు, వారి అనుచరులు కేతన, మారన, బయ్యన మొదలగు వారు 12 వ శతాబ్దమునకు చెందినవారు.

"అభినవ దండి", "కవిజన మిత్రుడు" అను బిరుదములు పొందిన శ్రీ కేతన గారు రచించిన, సంస్కృత గద్య కావ్యములలో, కథా కావ్యములలో మిక్కిలి ప్రసిధ్ధమైన దశకుమార చరిత్ర  గ్రంథమును అంకితము పొందిన తిక్కనామాత్యులు కేతనను "సంస్కృతాది భాషల నుతి గన్నవాడని" ప్రశంసించారు.

కథా కావ్యములనగానే మనకు స్ఫురించునవి శ్రీ బాణభట్టు కాదంబరి, దండి దశకుమార చరిత్ర, హాలుని గాథా సప్తశతి మున్నగునవి. కథా కావ్యములందలి కథలన్నియు కల్పితములు, లౌకికములు. "కథ్యతే ఇతి కథా". భామహుడు కథ, ఆఖ్యాయిక అని రెండు రకాలను పేర్కొని, ఆఖ్యాయికలో నాయకుడు చెప్తాడనీ, కథలో కవి గానీ, ఇతరులు గానీ కథకులని చెప్పారు. దండి దశకుమార చరిత్రలో ఈ రెండు లక్షణాలు కనిపిస్తాయి.  దశకుమార చరిత్ర  పూర్వపీఠిక, ఉత్తర పీఠిక అని రెండు భాగములుగా నున్నది.

దండి మహాకవి గొప్ప కల్పనా శక్తి కలవాడు, గొప్ప పండితుడు, శాస్త్రజ్ఞుడు, లోకజ్ఞుడు. అనేక విద్యలయందు ప్రావీణ్యత సంపాదించాడు. శిల్పకళయందు చతురుడు. ఈతని అసలు పేరు ఎవరికీ తెలియదు. ఈ మహాకవి వ్రాసిన ఒక పద్యము వలన ఈతనికి "దండి" అను నామము స్థిరపడినదని చెప్తారు.

"బ్రహ్మాండ చ్ఛత్ర దండః శతధృతి భువనాంభోరుహోనాల దండః
క్షోణీ నౌ కూప దండః శరదమృత సరిత్పట్టికా కేతు దండః!
జ్యోతిశ్చక్రాక్ష దండస్త్రిభువన విజయస్తంఘ్రి దండోంఘ్రి దండః
శ్రేయస్తే విక్రమస్తే వితరతు విబుధ ద్వేషిణాం కాల దండః"!!

దండిమహాకవి రచన పదలాలిత్యంతో అలరారుతుంది.
" ఉపమా కాళిదాసస్య
భారవేరర్ధ గౌరవమ్!
దండినః పదలాలిత్యం
మాఘే సన్తి త్రయో గుణాః"!!

కవిగా దండిమహాకవికి వ్యాసవాల్మీకులతో సమాన స్థానమిచ్చారు.

" జాతే జగతి వాల్మీకౌ
కవి ఇత్యభిధా2భవత్!
కవీతి కథ్యతే వ్యాసో
కవయస్త్వయి దండిని"!!

దశకుమార చరిత్రకు, క్షేమేంద్రుని బృహత్కథా మంజరికిని పోలికలున్నట్లుగ కనిపిస్తుంది. బృహత్కథా మంజరిలోని కొన్ని కథలే దశకుమార చరిత్రకు మూలమని కొందరి అభిప్రాయము.

చాలామంది ఛందోబద్ధమైన పద్య రచన చెయ్యటం కష్టమేమో కానీ, గద్యము వ్రాయటమేముంది?" అనుకుంటూ ఉంటారు. కానీ
"గద్యం కవీనాం నికషం వదన్తి" అన్నారు. పద్య రచనకెంతటి నైపుణ్యమవసరమో, గద్యానికీ అంతటి పాండిత్యమవసరమని చెప్పారు.

ఇతర సాహిత్య ప్రక్రియల వలెనే కథాకావ్య ప్రక్రియ కూడా సంస్కృతము నుండియే ఆంధ్రము గ్రహించబడినది.
" గద్యమ్మున దండి చెప్పిన కథాక్రమమొప్ప దెనుంగు బాస గద్యమ్మును పద్యముల బెరయ సంచిత భావ రసోదయాభిరామమ్మగునట్లుగా" కేతన దశకుమార చరిత్రను ఆంధ్రీకరించి, ఆంధ్రులకు గద్య కథా వాఙ్మయామృతమును రుచి చూపించినారు. తదాదిగా మనకు తెలుగులో అనేక కథా కావ్యములుద్భవించాయి.

పటువైన మృదువైన శైలిలో, దీర్ఘ సమాస పద భూయిష్ఠముకాని పదములతో ప్రసన్నతా గుణముతో నొప్పారునట్లు రచించబడిన దశకుమార  చరిత్ర పదిమంది యువకుల, రాజ కుమారుడు, మంత్రి కుమారుడు మొదలగు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కుమారుల సాహస గాథలను, దిగ్విజయములను వర్ణించు కథల సంపుటి. ఇందులో రాజవాహనుని కథ ముఖ్యమైనది. ప్రధాన కథతో పాటుగ అనేక ఉప కథలు చెప్పబడ్డాయి. ఒక కథ యందు మరొక కథ ప్రవేశ పెట్టబడుతూ
అనేక ప్రయోజనములు సాధింపబడ్డాయి. రాజవాహనునికి అవంతీ సుందరితో పరిణయము జరిగి కథ సుఖాంతమవుతుంది. 

బాల్యమునుండి కలిసి మెలిసి పెరిగిన రాజకుమారుడు  రాజవాహనుడు, అపహారవర్మ, ఉపహారవర్మ, మంత్రగుప్తుడు, అర్ధపాలుడు,  సోమదత్తుడు, మిత్రగుప్తుడు, ప్రమతి, పుష్పోద్భవుడు మరియు విశ్రుతుడు అను పదిమంది మంచి స్నేహితులు. వీరి చరిత్రే దశ కుమార చరిత్ర. ఈ పదిమంది జట్టుకు నాయకుడు రాజకుమారుడు రాజవాహనుడు.

రాజవాహనుని కథ, అపహార వర్మ కథ, పుష్పోద్భవుని , బంధుపాలుని వృత్తాంతము, అర్ధపాలుని కథ, విద్యేశ్వరుని కథ మెదలైనవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి నడిచాయి.

రాజవాహనునికి పట్టాభిషేకం జరగడానికి ముందు ఈ పది మంది స్నేహితులు ఒక చోట కలిసి, అక్కడి నుంచి ఎవరికి వారుగా వెళ్ళి ఏడాది తరువాత తిరిగి అదే చోట కలుసుకోవాలనీ, అనుభవాలను పంచుకోవాలనీ నిర్ణయించుకుని ఆ రాత్రికి అందరూ చెట్టు క్రింద విశ్రమిస్తారు. ఆ సమయంలో అక్కడికి వచ్చి అర్ధించిన మాతంగునికి సహాయం చెయ్యటానికి రాజవాహనుడు అతనితో కలిసి వెళతాడు. మర్నాడు ఉదయం స్నేహితులందరూ నిద్ర లేచి చూసి, రాజవాహనుని వెతుకుతూ తలా ఒక వైపుకు వెళ్తారు. సంవత్సర కాలం పూర్తవగానే రాజవాహనుడు అక్కడికి వస్తాడు. మిగిలిన కుమారులందరూ నెమ్మది  నెమ్మదిగా అక్కడికి చేరుతారు. ముందు రాజవాహనుడు తాను మాతంగునితో వెళ్ళినప్పటి నుంచి జరిగిన వృత్తాంతం చెప్తాడు. తరువాత అందరూ తమ తమ విచిత్రానుభవాలను పంచుకుంటారు. అదే దశ కుమారుల చరిత్ర. కర్ణికను ఆధారంగా చేసుకుని పద్మము యొక్క రేకలన్నీ ఉండునట్లుగా, కథ ఆసాంతమూ రాజవాహనుని ఆధారం చేసుకుని, కాండము నుంచి శాఖోపశాఖలుగా విస్తరించిన వృక్షంలా కథలను విస్తరింపజేసి తమ కథాకథన శిల్పంతో పట్టి నిలిపారు దండి మహాకవి, కేతన మహాకవి.

కథా కావ్యములో ఉండవలసిన అద్భుతరసము దశకుమార చరిత్రలో పుష్కలంగా ఉంది. దండి మహాకవి కల్పించిన అలౌకిక సన్నివేశములలో కొన్ని రాజవాహనుడు పాతాళ లోకమును సందర్శించటము, మానసారుడు తపస్సు చేసి, శివుని వద్ద నుండి ఒక గదను పొందటము, అవంతీ సుందరి రాజవాహనులు, తారావళీ కామపాలురు తమ పూర్వ జన్మ వృత్తాంతము తెలుసుకొనటము, రాక్షసునిచే నపహరింపబడిన కందుకవతి మరియొక రాక్షసునిచే రక్షింపబడుట మొదలైనవి.

అద్భుత కల్పనా చాతుర్యముతో, సముచిత పాత్రపోషణ, సంభాషణ, వర్ణనలతో దండిమహాకవి చేత రచింపబడిన దశకుమార చరిత్రను ఆంధ్రీకరించుటలో అంతటి ప్రతిభను ప్రదర్శించి శ్రీ కేతన కథా సాహిత్యమును ఆంధ్రులకు పరిచయము చేయుటే గాక, సాహిత్యము నాంధ్రీకరించుటలో మార్గదర్శిగా ఖ్యాతిగాంచెను.

దండి మహాకవి కథను ప్రధానము చేసి, సర్వ కావ్య గుణములను తదనుగుణముగా మలచి, వృత్తి, రీతి  పాకాదులు, శయ్యాలంకారాదులు సరిజూసి, తన కావ్య రచనా శిల్ప చాతుర్యమును వెలార్చెను.
కేతన దశకుమార చరిత్రలోని కథకు, కావ్యశిల్పమునకు ఆకృష్టుడై, అలతి అలతి మార్పులు జేయుచు కావ్యముగా మలచినాడు.

ప్రతి పాత్ర ఆ పాత్రకు తగిన రీతిలో ఔదార్యవంతముగా మలచబడినవి. రాజహంసుడు ధర్మ వర్తనుడైన రాజశ్రేష్ఠుడు. గర్వాంధుడై తనపైకి దండెత్తి వచ్చిన మానసారుని ఓడించి, క్షమించి వదిలివేసినాడు. ధర్మవర్మ మంచి రాజుకు ఉండవలసిన గుణములు కలవాడు. మత్తపాల, చండవర్మ, వికటవర్మలు దుష్ట స్వభావులు. రాజవాహన, మంత్రగుప్త, ఉపహారవర్మలు అద్వితీయ పరాక్రమవంతుడు, పరోపకార శీలురు. అపహారవర్మ కార్యసాధకుడు, నేర్పరి, ఔదార్యవంతుడు. ఆపన్నులను రక్షించఠమే ప్రవృత్తిగా కలవాడు. ఉఫహారవర్మ, మంత్రగుప్తుడు మంచి యుక్తిపరులు. అలాగే స్త్రీ పాత్రలు, అనేక ఇతర పాత్రలు చిత్రీకరింపబడ్డాయి. కథా కథనములో, రస పోషణలో, పాత్ర చిత్రణలో, కథా శిల్పములో, అనేక రీతులలో దండిమహాకవి, శ్రీ కేతన కూడా తమ ప్రతిభను ప్రదర్శించారు.

కావ్యోద్భవమునకు ప్రతిభా వ్యుత్పత్యభ్యాసములు మూడును కారణములుగా ముమ్మటుడు నిర్వచించాడు.

"శక్తిర్నిపుణతా లోక శాస్త్ర కావ్యాద్యవేక్ష్యణాత్!
కావ్యజ్ఞ శిక్షయాభ్యాస ఇతి హేతుస్తదుద్భవే" !!

జగన్నాథుడు ప్రతిభ ఒక్కటే కావ్య హేతువని నిర్ణయించారు. భగవద్దత్తమైన ప్రతిభకు వ్యుత్పత్తి,  అభ్యాసము కూడా తోడైతే, ఎంత చక్కని కావ్యకన్నియలుద్భవిస్తాయో ఎందరో కవులు నిరూపించారు. వారిలో దండి మహాకవి, శ్రీ కేతన కవి కూడా ఉన్నారు.

కేతన యొక్క భావుకతా శక్తికి పద్య రచనకు గూడ తిక్కనపై నీతడు రచించిన సీసపద్యములు నాన్యతో దర్శనీయమై వెలయుచున్నవి. ఉదాహరణకు ఒకాక పద్యం పరికిద్దాము.

"సుకవీంద్రబృంద రక్షణకు డెవ్వడనినవీ
డను నాలుకకు దొడవైనవాడు
చిత్త నిత్యస్థిత సివుడెవ్వడనిన వీ
డను శబ్దమును కర్ధమైనవాడు
దశదిశావిశ్రాంతయశు డెవ్వడనిన వీ
డని చెప్పుటకు బాత్రమైనవాడు
సకల విద్యా కళాచణుడెవ్వడనిన వీ
డని చూపుకు గురియైన వాడు
మనుమసిద్ధి మహేశ సమస్త రాజ్య
భార ధౌరేయు డభిరూప భావభవుడు
కొట్టరువు కొమ్మనామాత్యు కూరామి సుతుడు
దీన జనతా నిధానంబు తిక్కశౌరి - - - ".

కావ్యమునకు ఆత్మ రసము. రసమునకు ఔచిత్యము ప్రాణము వంటిది. రసపోషణలో దండి మహాకవి ఎంత సమర్ధుడో, కేతన కవి కూడా అంతటి సమర్ధతను చూపించినాడు.

అలంకారములు కావ్య కన్నియ అందాన్ని ఇనుమడింపజేస్తాయి.  ఉపమj ఉత్ప్రేక్ష స్వభావోక్తి అర్ధాంతరన్యాసాది అలంకారములతో తమ దశకుమార చరిత్రను మరింత అందంగా తీర్చి దిద్దారు, ఆంధ్ర సాహితీ జగత్తులో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకుని చిరయశస్సు నార్జించుకున్నారు.
ఇంతటి మహత్తర గ్రంథ పరిశోధన చేసి డా.హరి శివకుమార్ గారు చిర యశస్సు నార్జించుకున్నారు.

స్వస్తి.
🙏🙏🙏💐
డా.విశాలాక్షి

No comments:

Post a Comment