Saturday, April 4, 2020

అసతో మా సద్గమయ Dr Visalakshi

అసతో మా సద్గమయ
తమసో మా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతం గమయ.
ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః !!

మన భారత దేశ ప్రజలందరి ఆయురారోగ్యముల కోసము, ప్రపంచ ప్రజల క్షేమము కోసము మన దేశ ప్రధాని గారి పిలుపు మేరకు మనమందరము ఇవాళ రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిముషాల సేపు మనందరి సంఘీ భావమును ప్రకటిస్తూ మన ఇళ్ళల్లో దీపాలు వెలిగిద్దాము. ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ, మరే నూనేతోనైనా మన ఇంటి బాల్కనీలలో నిలబడి దీపాలు వెలిగిద్దాము. లేదా, కొవ్వొత్తి అయినా వెలిగించవచ్చు, టార్చ్ లైట్ ఆన్ చేసి వెలుగును చూపవచ్చు, లేదా సెల్ ఫోన్ లోని టార్చ్ నైనా ఆన్ చెయ్యవచ్చు. కావలసినది మటుకు, కుల మత వర్ణ వర్గ లింగ వయో భాషా భేదములు లేకుండా మన భారతీయులమందరము ఏకమైయున్నామనీ, ప్రస్తుతము మనలను, మానవులందరినీ బాధిస్తున్న శతృవుపై ధ్వజమెత్తి, విజయాన్ని కాంక్షిస్తున్నామనీ తెలియజెయ్యటమే ! లాక్డౌన లో ఉన్నవారందరికీ మీ కోసం మేమున్నామని తెలియజెయ్యటమే ! మనందరి ఆరోగ్యము కోసము తమ ఆయురారోగ్యములను పణంగా పెట్టి అహరహము కృషి చేస్తున్న వైద్యులకు, నర్సులకు, పారా మేడికల్ ష్టాఫ్ వారికి, శానిటరీ వర్కర్స్ కి, పోలీసు శాఖ వారికి, నిత్యావసర వస్తువులను సమకూరుస్తున్న వారందరికీ, మనందరి రక్షణ కోసం కృషి చేస్తున్న వారందరి పట్ల, అధికారుల పట్ల కృతజ్ఞతలు తెలియజేయటానికి, మీకు మేమున్నామని చెప్పటానికి, మనందరిలో ఐకమత్యమున్నదని తెలియపరచటానికి మనమందరమూ ఇవాళ రాత్రి తొమ్మిది గంటల నుండి తొమ్మిది నిముషాల సేపు మన మనస్సుతో దుష్ట త్వము మీద విజయాన్ని సంకల్పించి, దీపాలను వెలిగించి, ఆ సమయంలో మన మన ఇళ్ళల్లో ఉన్న విద్దుద్దీపాలను తొమ్మిది నిముషాల సేపు నిలిపివేద్దాము. ఆ సమయంలో మన ఇళ్ళల్లోని ఫాన్లు, ఏసిలు ఆన్ లోనే ఉండవచ్చును. ఎవరైనా వెట్ గ్రైండర్ లో పప్పు రుబ్బుకుంటుంటే, దానిని ఆన్ లో ఉంచ వచ్చును.

చేయవలసినది ఏమిటంటే, చెడు మీద మంచి విజయం సాధించాలనే సామూహిక సంకల్పంతో ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క దీపం వెలిగించటం, ఆ తొమ్మిది నిముషాల సేపు మనం వెలిగించిన దీప కాంతులు కనిపించటం కోసము మన ఇళ్ళల్లోని విద్దుద్దీపాలను నిలిపి వెయ్యటము. దీని వలన మనం అనేక ప్రయోజనాలను సాధించగలము.

1. దీప ప్రజ్వలనము దేవతారాధన.

"దీపం జ్యోతి పరబ్రహ్మ
దీపం జ్యోతీ పరాయణం !
దీపేన సాధ్యతే సర్వం
దీపదేవీ నమో2స్తు తే" !!

మన భారతీయ సంప్రదాయంలో దీపం వెలిగించనిదే ఏ పనీ మొదలు పెట్టము. ఏ పూజకైనా, ఫంక్షన్లకైనా, పుస్తకావిష్కరణ సభలకైనా అన్నింటికీ ముందు దీప ప్రజ్వలనంతోనే కార్యక్రమం ప్రారంభమవుతుంది.

ప్రపంచ దీపం శ్రీ సూర్యనారాయణ స్వామి వెలగటం ప్రారంభమవగానే మనకు పగలు ప్రారంభమై, మనలోని తంద్రత ఎగిరిపోయి, చురుకుదనం, ఉత్సాహం, పని చెయ్యగల సామర్ధ్యం కలుగుతాయి.

పంచాయతన పూజలో దీపము రూపంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడని చెప్తారు. జ్యోతిశ్శాస్త్ర ప్రకారము నేటి ఈ గడ్డు కాలంలో దీప రూపంలో సుబ్రహ్మణ్య ఆరాధన ఆయురారోగ్య జ్ఞాన ప్రదాయకము.

2. కుల మత వర్ణ వర్గ లింగ వయో భాషా భేదాదులు ఏవీ లేకుండా, మానవులందరమూ ఒక్కటేనని చాటి చెప్పే మహత్తర అవకాశము మనము ఇలా ఒకే సమయంలో ఒకే సంకల్పంతో వెలుగును, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఒకే పని - దీప ప్రజ్వలనము చెయ్యటము. దీప ప్రజ్వలనము పాప హరము. ఇలా దీపాలు వెలిగించటం వలన మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ తొలగిపోతాయి. జీవితంలో ఒక్కసారైనా దీపము వెలిగించనివారు ఇప్పుడు దీపం వెలిగించటం వలన ఆ దోషాన్ని పోగొట్టుకుంటారు. దోషం పోతే శుభం కలుగుతుంది. పాపం పోతే పుణ్యం లభిస్తుంది.

3. దీపాలు వెలిగించే సంప్రదాయం లేనివారైనా భారతీయులందరూ, మానవులందరూ కూడా వెలుగును కాంక్షిస్తారు కదా ! వెలుగు లేకపోతే అంధకారమే !  అది ఎవ్వరమూ కోరము కదా ! కనుక మనకు వెలుగు కావాలి. ఆరోగ్యము, ఆయుర్దాయము, ఆనందము కావాలని కోరటమే ఈ కొవ్వొత్తి మొదలైన వాటితో వెలుగును చూపించటము.

4. "సంఘే శక్తిః కలౌ యుగే" అన్నారు. కలియుగంలో సమూహికంగా చేసే పనులకు శక్తి ఎక్కువ. సామూహికంగా ఒక్కటై మనమందరమూ సంకల్పిస్తే, నేడు ప్రపంచ మానవులెదుర్కొంటున్న సమస్య రూపు మాసి పోతుంది. ఈ యుద్ధంలో మానవులు విజయము పొందుతాము.

5. ఏ స్వార్ధం చింత లేకుండా ఎవరైతే సర్వ మానవాళి, సర్వ ప్రాణి కోటి శుభాన్ని కోరతారో వారి శుభాన్ని పరమాత్మ కోరతాడు. కనుక మనమందరమూ మానవ జాతి ఈ పెను ముప్పు నుంచి రక్షించ బడాలనీ, అందరూ సుఖంగా ఉండాలని కోరుకుందాము. అందరి సుఖంలోనే మన సుఖం ఉన్నదన్న సత్యాన్ని గుర్తిద్దాము.

6. ఒక్క మనిషి సుఖంగా బ్రతకాలంటే ఎంత మంది మానవుల సహాయ సహకారాలు ఉంటే అది సాధ్యపడుతుందో గుర్తించి, అందరి శుభం కోరుకుందాము, మనం సుఖంగా ఉందాము.

తొమ్మిది ననిముషాల సేపు ఎందుకంటే, తొమ్మిది పూర్ణ సంఖ్య కనుక మనకు పూర్ణత్వము సిద్థిస్తుంది, జగన్మాత అవుగ్రహం లభిస్తుంది కనుక !

"ధర్మ ఏవ హతో హన్తి
ధర్మో రక్షతి రక్షితః"

జై హింద్ జై భరతమాత
మానవ జాతి వర్ధిల్లు గాక!
పరమాత్మనే నమోనమః

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
డా.విశాలాక్షి.

Dasakumar Charitra దశకుమార చరిత్ర.

 దశకుమార చరిత్ర.
         - - - - - - - - - - - - - - -
డా.హరి శివకుమార్ గారి సిద్ధాంత గ్రంథము "కేతన - ఆయన కృతులు."

శ్రీ మాలఘటిక కేతన గారు దండిమహాకవి సంస్కృతమున రచించిన దశకుమార చరిత్రను అనువదించినారు. దానిని శ్రీ కొట్టరువు తిక్కనగారికి అంకిత మిచ్చినారు.

ఆయన  ప్రప్రథమముగ "ఆంధ్ర భాషా భూషణము" అను పేరున తెలుగు భాషలో వ్యాకరణమును రచించి, ఆంధ్రభాషా వ్యాకరణ రచయితలకు మార్గదర్శకులయ్యారు.

శ్రీ కేతన గారు ధర్మశాస్త్రములందలి ప్రీతితో యాజ్ఞవల్క్య స్మృతిని అనువదించి, విజ్ఞానేశ్వరుని వ్యాఖ్య మీద గల గౌరవముతో తన గ్రంథమునకు ఆ పేరే పెట్టుకున్నారు.

శ్రీ కేతన గ్రంథములను అధ్యయనాంశముగా స్వీకరించి తమ సిద్ధాంత గ్రంథమును పైన పేర్కొన్న మూడు ముఖ్య భాగములుగా విభజించి మనకు అందించారు డా శివకుమార్ గారు. ప్రస్తుత చర్చనీయాంశము ఆ పరిశోధనా గ్రంథములోని ప్రథమ అధ్యాయము. అది "దశ కుమార చరిత్రము. "

శ్రీ కేతనార్యులవారు తమ అనువాదములో మూల రచయిత శ్రీ దండిమహాకవికి ఎంతో న్యాయము చేసినారని డా.హరి శివకుమార్ గారు తెలియజేసినారు. అనువాదకుని యొక్క స్వతంత్రమైన బుద్ధి వైభవము ఆయన రచనలో ద్యోతకమగుచున్నదని భావించినారు.

డా.శివకుమార్ గారు తమ పరిశోధన గ్రంథములోని ప్రథమ భాగమైన "దశ కుమార చరిత్రము" ను -

1. కథాకావ్య ప్రక్రియా వివేచనము,
2.దండి - దశ కుమార చరిత్ర,
3. దశకుమార చరిత్రము - అనువాద పద్థతి,
4.దశకుమార చరిత్రము - పాత్ర చిత్రణము,
5.దశ కుమార చరిత్రము - రస భావములు,
6.దశ కుమార చరిత్రము - వర్ణనములు,
7.కేతన కవితా శక్తి,
8.కేతన రచనా పాటవము
9.ఆంధ్ర కథా కావ్యములు - దశ కుమార చరిత్రము -

అను తొమ్మిది అధ్యాయములుగా విభజించినారు.

మార్గ కవిత్వము, దేశి కవిత్వములలో మార్గ కవిత్వమునకు పెద్ద పీట వేసిన శ్రీ తిక్కన సోమయాజులు, వారి అనుచరులు కేతన, మారన, బయ్యన మొదలగు వారు 12 వ శతాబ్దమునకు చెందినవారు.

"అభినవ దండి", "కవిజన మిత్రుడు" అను బిరుదములు పొందిన శ్రీ కేతన గారు రచించిన, సంస్కృత గద్య కావ్యములలో, కథా కావ్యములలో మిక్కిలి ప్రసిధ్ధమైన దశకుమార చరిత్ర  గ్రంథమును అంకితము పొందిన తిక్కనామాత్యులు కేతనను "సంస్కృతాది భాషల నుతి గన్నవాడని" ప్రశంసించారు.

కథా కావ్యములనగానే మనకు స్ఫురించునవి శ్రీ బాణభట్టు కాదంబరి, దండి దశకుమార చరిత్ర, హాలుని గాథా సప్తశతి మున్నగునవి. కథా కావ్యములందలి కథలన్నియు కల్పితములు, లౌకికములు. "కథ్యతే ఇతి కథా". భామహుడు కథ, ఆఖ్యాయిక అని రెండు రకాలను పేర్కొని, ఆఖ్యాయికలో నాయకుడు చెప్తాడనీ, కథలో కవి గానీ, ఇతరులు గానీ కథకులని చెప్పారు. దండి దశకుమార చరిత్రలో ఈ రెండు లక్షణాలు కనిపిస్తాయి.  దశకుమార చరిత్ర  పూర్వపీఠిక, ఉత్తర పీఠిక అని రెండు భాగములుగా నున్నది.

దండి మహాకవి గొప్ప కల్పనా శక్తి కలవాడు, గొప్ప పండితుడు, శాస్త్రజ్ఞుడు, లోకజ్ఞుడు. అనేక విద్యలయందు ప్రావీణ్యత సంపాదించాడు. శిల్పకళయందు చతురుడు. ఈతని అసలు పేరు ఎవరికీ తెలియదు. ఈ మహాకవి వ్రాసిన ఒక పద్యము వలన ఈతనికి "దండి" అను నామము స్థిరపడినదని చెప్తారు.

"బ్రహ్మాండ చ్ఛత్ర దండః శతధృతి భువనాంభోరుహోనాల దండః
క్షోణీ నౌ కూప దండః శరదమృత సరిత్పట్టికా కేతు దండః!
జ్యోతిశ్చక్రాక్ష దండస్త్రిభువన విజయస్తంఘ్రి దండోంఘ్రి దండః
శ్రేయస్తే విక్రమస్తే వితరతు విబుధ ద్వేషిణాం కాల దండః"!!

దండిమహాకవి రచన పదలాలిత్యంతో అలరారుతుంది.
" ఉపమా కాళిదాసస్య
భారవేరర్ధ గౌరవమ్!
దండినః పదలాలిత్యం
మాఘే సన్తి త్రయో గుణాః"!!

కవిగా దండిమహాకవికి వ్యాసవాల్మీకులతో సమాన స్థానమిచ్చారు.

" జాతే జగతి వాల్మీకౌ
కవి ఇత్యభిధా2భవత్!
కవీతి కథ్యతే వ్యాసో
కవయస్త్వయి దండిని"!!

దశకుమార చరిత్రకు, క్షేమేంద్రుని బృహత్కథా మంజరికిని పోలికలున్నట్లుగ కనిపిస్తుంది. బృహత్కథా మంజరిలోని కొన్ని కథలే దశకుమార చరిత్రకు మూలమని కొందరి అభిప్రాయము.

చాలామంది ఛందోబద్ధమైన పద్య రచన చెయ్యటం కష్టమేమో కానీ, గద్యము వ్రాయటమేముంది?" అనుకుంటూ ఉంటారు. కానీ
"గద్యం కవీనాం నికషం వదన్తి" అన్నారు. పద్య రచనకెంతటి నైపుణ్యమవసరమో, గద్యానికీ అంతటి పాండిత్యమవసరమని చెప్పారు.

ఇతర సాహిత్య ప్రక్రియల వలెనే కథాకావ్య ప్రక్రియ కూడా సంస్కృతము నుండియే ఆంధ్రము గ్రహించబడినది.
" గద్యమ్మున దండి చెప్పిన కథాక్రమమొప్ప దెనుంగు బాస గద్యమ్మును పద్యముల బెరయ సంచిత భావ రసోదయాభిరామమ్మగునట్లుగా" కేతన దశకుమార చరిత్రను ఆంధ్రీకరించి, ఆంధ్రులకు గద్య కథా వాఙ్మయామృతమును రుచి చూపించినారు. తదాదిగా మనకు తెలుగులో అనేక కథా కావ్యములుద్భవించాయి.

పటువైన మృదువైన శైలిలో, దీర్ఘ సమాస పద భూయిష్ఠముకాని పదములతో ప్రసన్నతా గుణముతో నొప్పారునట్లు రచించబడిన దశకుమార  చరిత్ర పదిమంది యువకుల, రాజ కుమారుడు, మంత్రి కుమారుడు మొదలగు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కుమారుల సాహస గాథలను, దిగ్విజయములను వర్ణించు కథల సంపుటి. ఇందులో రాజవాహనుని కథ ముఖ్యమైనది. ప్రధాన కథతో పాటుగ అనేక ఉప కథలు చెప్పబడ్డాయి. ఒక కథ యందు మరొక కథ ప్రవేశ పెట్టబడుతూ
అనేక ప్రయోజనములు సాధింపబడ్డాయి. రాజవాహనునికి అవంతీ సుందరితో పరిణయము జరిగి కథ సుఖాంతమవుతుంది. 

బాల్యమునుండి కలిసి మెలిసి పెరిగిన రాజకుమారుడు  రాజవాహనుడు, అపహారవర్మ, ఉపహారవర్మ, మంత్రగుప్తుడు, అర్ధపాలుడు,  సోమదత్తుడు, మిత్రగుప్తుడు, ప్రమతి, పుష్పోద్భవుడు మరియు విశ్రుతుడు అను పదిమంది మంచి స్నేహితులు. వీరి చరిత్రే దశ కుమార చరిత్ర. ఈ పదిమంది జట్టుకు నాయకుడు రాజకుమారుడు రాజవాహనుడు.

రాజవాహనుని కథ, అపహార వర్మ కథ, పుష్పోద్భవుని , బంధుపాలుని వృత్తాంతము, అర్ధపాలుని కథ, విద్యేశ్వరుని కథ మెదలైనవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి నడిచాయి.

రాజవాహనునికి పట్టాభిషేకం జరగడానికి ముందు ఈ పది మంది స్నేహితులు ఒక చోట కలిసి, అక్కడి నుంచి ఎవరికి వారుగా వెళ్ళి ఏడాది తరువాత తిరిగి అదే చోట కలుసుకోవాలనీ, అనుభవాలను పంచుకోవాలనీ నిర్ణయించుకుని ఆ రాత్రికి అందరూ చెట్టు క్రింద విశ్రమిస్తారు. ఆ సమయంలో అక్కడికి వచ్చి అర్ధించిన మాతంగునికి సహాయం చెయ్యటానికి రాజవాహనుడు అతనితో కలిసి వెళతాడు. మర్నాడు ఉదయం స్నేహితులందరూ నిద్ర లేచి చూసి, రాజవాహనుని వెతుకుతూ తలా ఒక వైపుకు వెళ్తారు. సంవత్సర కాలం పూర్తవగానే రాజవాహనుడు అక్కడికి వస్తాడు. మిగిలిన కుమారులందరూ నెమ్మది  నెమ్మదిగా అక్కడికి చేరుతారు. ముందు రాజవాహనుడు తాను మాతంగునితో వెళ్ళినప్పటి నుంచి జరిగిన వృత్తాంతం చెప్తాడు. తరువాత అందరూ తమ తమ విచిత్రానుభవాలను పంచుకుంటారు. అదే దశ కుమారుల చరిత్ర. కర్ణికను ఆధారంగా చేసుకుని పద్మము యొక్క రేకలన్నీ ఉండునట్లుగా, కథ ఆసాంతమూ రాజవాహనుని ఆధారం చేసుకుని, కాండము నుంచి శాఖోపశాఖలుగా విస్తరించిన వృక్షంలా కథలను విస్తరింపజేసి తమ కథాకథన శిల్పంతో పట్టి నిలిపారు దండి మహాకవి, కేతన మహాకవి.

కథా కావ్యములో ఉండవలసిన అద్భుతరసము దశకుమార చరిత్రలో పుష్కలంగా ఉంది. దండి మహాకవి కల్పించిన అలౌకిక సన్నివేశములలో కొన్ని రాజవాహనుడు పాతాళ లోకమును సందర్శించటము, మానసారుడు తపస్సు చేసి, శివుని వద్ద నుండి ఒక గదను పొందటము, అవంతీ సుందరి రాజవాహనులు, తారావళీ కామపాలురు తమ పూర్వ జన్మ వృత్తాంతము తెలుసుకొనటము, రాక్షసునిచే నపహరింపబడిన కందుకవతి మరియొక రాక్షసునిచే రక్షింపబడుట మొదలైనవి.

అద్భుత కల్పనా చాతుర్యముతో, సముచిత పాత్రపోషణ, సంభాషణ, వర్ణనలతో దండిమహాకవి చేత రచింపబడిన దశకుమార చరిత్రను ఆంధ్రీకరించుటలో అంతటి ప్రతిభను ప్రదర్శించి శ్రీ కేతన కథా సాహిత్యమును ఆంధ్రులకు పరిచయము చేయుటే గాక, సాహిత్యము నాంధ్రీకరించుటలో మార్గదర్శిగా ఖ్యాతిగాంచెను.

దండి మహాకవి కథను ప్రధానము చేసి, సర్వ కావ్య గుణములను తదనుగుణముగా మలచి, వృత్తి, రీతి  పాకాదులు, శయ్యాలంకారాదులు సరిజూసి, తన కావ్య రచనా శిల్ప చాతుర్యమును వెలార్చెను.
కేతన దశకుమార చరిత్రలోని కథకు, కావ్యశిల్పమునకు ఆకృష్టుడై, అలతి అలతి మార్పులు జేయుచు కావ్యముగా మలచినాడు.

ప్రతి పాత్ర ఆ పాత్రకు తగిన రీతిలో ఔదార్యవంతముగా మలచబడినవి. రాజహంసుడు ధర్మ వర్తనుడైన రాజశ్రేష్ఠుడు. గర్వాంధుడై తనపైకి దండెత్తి వచ్చిన మానసారుని ఓడించి, క్షమించి వదిలివేసినాడు. ధర్మవర్మ మంచి రాజుకు ఉండవలసిన గుణములు కలవాడు. మత్తపాల, చండవర్మ, వికటవర్మలు దుష్ట స్వభావులు. రాజవాహన, మంత్రగుప్త, ఉపహారవర్మలు అద్వితీయ పరాక్రమవంతుడు, పరోపకార శీలురు. అపహారవర్మ కార్యసాధకుడు, నేర్పరి, ఔదార్యవంతుడు. ఆపన్నులను రక్షించఠమే ప్రవృత్తిగా కలవాడు. ఉఫహారవర్మ, మంత్రగుప్తుడు మంచి యుక్తిపరులు. అలాగే స్త్రీ పాత్రలు, అనేక ఇతర పాత్రలు చిత్రీకరింపబడ్డాయి. కథా కథనములో, రస పోషణలో, పాత్ర చిత్రణలో, కథా శిల్పములో, అనేక రీతులలో దండిమహాకవి, శ్రీ కేతన కూడా తమ ప్రతిభను ప్రదర్శించారు.

కావ్యోద్భవమునకు ప్రతిభా వ్యుత్పత్యభ్యాసములు మూడును కారణములుగా ముమ్మటుడు నిర్వచించాడు.

"శక్తిర్నిపుణతా లోక శాస్త్ర కావ్యాద్యవేక్ష్యణాత్!
కావ్యజ్ఞ శిక్షయాభ్యాస ఇతి హేతుస్తదుద్భవే" !!

జగన్నాథుడు ప్రతిభ ఒక్కటే కావ్య హేతువని నిర్ణయించారు. భగవద్దత్తమైన ప్రతిభకు వ్యుత్పత్తి,  అభ్యాసము కూడా తోడైతే, ఎంత చక్కని కావ్యకన్నియలుద్భవిస్తాయో ఎందరో కవులు నిరూపించారు. వారిలో దండి మహాకవి, శ్రీ కేతన కవి కూడా ఉన్నారు.

కేతన యొక్క భావుకతా శక్తికి పద్య రచనకు గూడ తిక్కనపై నీతడు రచించిన సీసపద్యములు నాన్యతో దర్శనీయమై వెలయుచున్నవి. ఉదాహరణకు ఒకాక పద్యం పరికిద్దాము.

"సుకవీంద్రబృంద రక్షణకు డెవ్వడనినవీ
డను నాలుకకు దొడవైనవాడు
చిత్త నిత్యస్థిత సివుడెవ్వడనిన వీ
డను శబ్దమును కర్ధమైనవాడు
దశదిశావిశ్రాంతయశు డెవ్వడనిన వీ
డని చెప్పుటకు బాత్రమైనవాడు
సకల విద్యా కళాచణుడెవ్వడనిన వీ
డని చూపుకు గురియైన వాడు
మనుమసిద్ధి మహేశ సమస్త రాజ్య
భార ధౌరేయు డభిరూప భావభవుడు
కొట్టరువు కొమ్మనామాత్యు కూరామి సుతుడు
దీన జనతా నిధానంబు తిక్కశౌరి - - - ".

కావ్యమునకు ఆత్మ రసము. రసమునకు ఔచిత్యము ప్రాణము వంటిది. రసపోషణలో దండి మహాకవి ఎంత సమర్ధుడో, కేతన కవి కూడా అంతటి సమర్ధతను చూపించినాడు.

అలంకారములు కావ్య కన్నియ అందాన్ని ఇనుమడింపజేస్తాయి.  ఉపమj ఉత్ప్రేక్ష స్వభావోక్తి అర్ధాంతరన్యాసాది అలంకారములతో తమ దశకుమార చరిత్రను మరింత అందంగా తీర్చి దిద్దారు, ఆంధ్ర సాహితీ జగత్తులో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకుని చిరయశస్సు నార్జించుకున్నారు.
ఇంతటి మహత్తర గ్రంథ పరిశోధన చేసి డా.హరి శివకుమార్ గారు చిర యశస్సు నార్జించుకున్నారు.

స్వస్తి.
🙏🙏🙏💐
డా.విశాలాక్షి

Ugadi..Continued

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కాలపరబ్రహ్మణే నమో నమః.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది పండుగ మనందరికీ సకల శుభములను కలిగించు గాక ! మానవాళిని భయభ్రాంతులను చేస్తున్న కరోనా వైరస్ సంపూర్ణముగా నశించిపో గాక !

రాబోయే సంవత్సర నామము శ్రీ శార్వరి. రాబోయే ఉగాది నుంచి శ్రీ శార్వరి నామ సంవత్సరం ప్రారంభమవుతున్నది. ఎల్లుండి 25.3.2020 నుంచి ప్రారంభమవబోతున్న శ్రీ శార్వరి నామ సంవత్సరంలో శర్వరీ దేవి - శర్వుడు, శర్వాణి సర్వ మానవాళికి, సర్వ ప్రాణికోటికి ఆయురారోగ్యైశ్వర్యములను అనుగ్రహించు గాక !

శార్వరి అంటే శర్వుని భార్య శర్వాణి. శర్వ శర్వాణులకు సంబంధించినది శార్వరి. కనుక ఈ సంవత్సరమంతా శివపార్వతుల కటాక్షంతో శుభాలు జరుగుతాయని మనం గ్రహించాలి. .

శర్వుడు అనగా భూమి నుంచి పంటలను పండించే శక్తి కలవాడు.
శర్వాణి అనగా శర్వుని భార్య, పార్వతీదేవి. భూమి నుంచి మనకు కావలసిన సస్యములను మనకు అనుగ్రహించి ఇస్తుంది.

శర్వుడనగా ప్రళయ కాలమున భూములను హింసించేవాడు అని విద్యార్ధి కల్పతరువులో చెప్పారు. అనగా ప్రళయ కాలంలో ప్రకృతిని బాధించే వారిని హింసించే వాడని అర్ధము.

శర్వరి అనగా వ్యాపారమును - అనగా పనులను గాని, దినమును కానీ చెరచునది, అనగా రాత్రి అని అర్ధము.

"రాతి సుఖం దదాతీతి రాత్రి" అన్నారు. ఇనందాన్నిచ్చేది రాత్రి. భౌతిక, లౌకిక విషయాసక్తిని తగ్గించి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగించేది, ఆనందాన్నిచ్చేది శార్వరి.

"యా నిశా సర్వ భూతేషు తస్య జాగర్తి సంయమీ" అన్నారు.
సాధారణ మానవులకు ఏది పగలో, అది జ్ఞానులకు, యోగులకు రాత్రి. వారి రాత్రి వీరికి పగలు. అనగా, సాధారణ మానవులు అజ్ఞానంతో దేహాత్మ బుద్ధితో భౌతిక సుఖాలే శాశ్వత మనుకుంటారు. యోగులు, జ్ఞానులు నిత్యానిత్య వివేకం కలిగి, భౌతికత యొక్క అశాశ్వతత్వాన్ని, పరమాత్మ యొక్క శాశ్వతత్వాన్ని గ్రహిస్తారు. అలా గుర్తింపజేసేది శార్వరి.

"శార్వరి వత్సరే
సస్య వృద్ధిః భవేత్ భువి !
రాజానో విలయం యాంతి పరస్పర జయేచ్ఛయా" !! అని చెప్పారు.
అంటే, ఈ శార్వరి సంవత్సరంలో పంటలు సమృద్ధిగా చక్కగా పండుతాయి. కానీ, రాజులు - అంటే అధికారులు ఎవరికి వారే గెలవాలనే తపనతో విలయ తాండవం చేస్తారు. విలయం అఖంటే విశేషంగా లయించటం. ధర్మానికి ఎప్పుడూ విజయమే లభిస్తుంది.

యుగాదినే మనము ఉగాది అంటున్నాము.
ఉగస్య ఆదిః ఉగాది - ఉగము అంటే నక్షత్ర గమనము అని అర్ధము. నక్షత్ర గమనానికి ప్రారంభపు రోజు. ఈ రోజు నుంచి నూతన కాలగణన ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రోజుకు ఉగాది అని పేరు వచ్చింది.

ఉగము అనే పదానికి జన్మ, ఆయుష్షు అనే అర్ధాలు కూడా ఉన్నాయి. దీనిని బట్టి, ఈ సృష్టి యొక్క, ప్రపంచము యొక్క ఆవిర్భావానికి మొదటి రోజు ఈ రోజే  కనుక, అనగా చైత్ర శుద్ధ పాడ్యమిన కనుక ఈ రోజును మనం ఉగాదిగా పండుగ జరుపుకుంటాము.
బ్రహ్మ దేవుడు ప్రప్రథమంగా సృష్టి ప్రారంభించింది చైత్ర శుద్ధ పాడ్యమిన కనుక మనము ఆ రోజును ఉగాది పండుగగా జరుపుకుంటాము.

కాలయులో జరిగే మార్పులను మనము చక్కగా గ్రహించగలుగుతాము. చైత్ర మాసంలో ప్రకృతి ఎంతో ప్రసన్నంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. సూర్యుని వేడిమి ఎక్కువే సూచనలు కనిపిస్తున్నా  ఎక్కువ వేడి ఉండదు, వానలు ఉండవు. ప్రకృతిలో సమతౌల్యత భాసిస్తుంది. పగలు, రాత్రి కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. చెట్లు చిగురుస్తాయి. సువాసనలు వెదజల్లుతూ, మల్లెలు, సన్నజాజులు విరబూయటం ప్రారంభిస్తాయి. చక్కని పూతతో నిండిన మామిడి చెట్ల మీద కూర్చుని కోకిలలు కుహూ రాగాలాలపించటం మొదలెడతాయి. వేప చెట్లు నిలువెల్లా పూలతో నిండి, సువాసన భరితమైన, ఆరోగ్యకరమైన గాలులో పరిసరాలను శుద్థి చేస్తూ, కన్నుల పండుగగా గోచరిస్తుంటాయి.

యుగము అంటే జంట. ఉత్తరాయణ దక్షిణాయనములనబడే రెండు భాగములుగా  కల సంవత్సర కాలమునకు ప్రారంభ దినము కనుక ఈ రోజును ఉగాది అంటారు.

ఉగాది నాడు మనమందరమూ తప్పకుండా చేయవలసిన పనులు - సూర్యోదయానికి ముందే నిద్ర లేచి అభ్యంగన స్నానమాచరించటము, ఉగాది పురుషుని ఆరాధించి, వేప పచ్చడి నివేదించి, మనము స్వీకరించటము, పంచాంగశ్రవణము చెయ్యటము, ప్రపాదాన ఫ్రారంభము చెయ్యటము.

పంచాంగ శ్రావణము పాపహరము. తిథి వార నక్షత్ర కరణ యోగము లనబడే పంచాంగ జ్ఞానము కలిగి ఉండి, ప్రకృతి మాతకు అనుకూలంగా జీవితమును గడుపుతూ ఐహికంగా ఆయురారోగ్యైశ్వర్యములను, ఆముష్మిక శుభములను, నిశ్శ్రేయస్సును పొందుదుము గాక!!

🙏🙏🙏💐
డా.విశాలాక్షి

యుగాది - ఉగాది ప్రాశస్త్యం. Importance of Ugadi

యుగాది - ఉగాది ప్రాశస్త్యం.
--------------------------------------

సృష్ట్యారంభ దినారంభం యుగారంభం - ఉగాది పండగ - యుగాది పండగ.
ఆంధ్రుల,  కన్నడ, మరాఠి జనులకు
మహోత్సాహదము మొదటి పండగ
చైత్రశుధ్ధ పాడ్యమి దినమే
ప్రకృతి లో ప్రజలకు ప్రథమ దినం.
కాలగణన ప్రారంభ దినం.
కొత్త వత్సరం, కొత్త మాసం, కొత్త దినం
ఈరోజేనని భాస్కరాచార్యులు ప్రకటించారు.

జ్యోతిశ్శాస్త్రం ఖగోళ శాస్త్రం,  పుట్టిన దేశం, పండినదేశం మన భారతదేశం.!!
సూర్యుని ద్వాదశ రాశుల చలనము
చాంద్రమాన, బార్హస్పత్య, నక్షత్ర మాన, సౌర, సావన కాలమానములకు కారణము.

ఉ - అన - ఉడు - నక్షత్రం
గ - అన - గమనం
ఆది - అన - ప్రథమం
చంద్రుడు నక్షత్రాలలొ కదిలే
క్రమారంభమే ఉగాది అనబడు.

పన్నెండు పౌర్ణముల, అమావాస్యలతొ
కొలవబడు కాలమే చాంద్రమానం.
అది మనకు సంవత్సరం.
ఆంధ్రులకు ప్రామాణికం చాంద్రమానం.

బార్హస్పత్యం బృహస్పతి మానం.
గురువు ఒక రాశిచక్ర భ్రమణకాలం
మన ద్వాదశ చాంద్రమాన సంవత్సర కాల సదృశం.
అట్టి ఐదు వత్సరములను
ఒక యుగమనుట కద్దు.
పన్నెండు ఐదుల అరువది కనుక
మనకు కలవు సంవత్సరములు అరవై.
అవియే మళ్ళీ మళ్ళీ పరిభ్రమిస్తాయి.
ఆ యుగ ఆరంభం చైత్రశుధ్ధ పాడ్యమి నాడే!
అందుకే ఉగాది ని యుగాది అంటారు.

ఉగాది నాడే బ్రహ్మదేవుడు
సృష్టిని ప్రారంభించాడు.
ప్రకృతి అంతా ఆకులు రాల్చి
క్రొత్త చిగుళ్లను తొడిగేను.
నవ కిసలయ శోభతొ, పూలుపళ్ళతొ
ఎంతోకళకళలాడేను.
నవ జీవనాన్ని అవి పొందేను.
మన అభివృద్ధిని సూచించేను.
పరవశముతొ కోకిల గానం చేసేను.
సువాసన సంభరితమౌ
మల్లెలు మొల్లలు విరగబూసి
సౌరభమంతా నిండేను.
వసంత కాలమె మధుమాసం.
ప్రకృతిలో మైమరపించే అందం,
ఆనందం నిండును వసంతమందే.

ఉగాదినాడు మనకందరకూ
దశవిధ కృత్యాచరణమె శ్రేష్ఠం
ప్రతి గృహ ధ్వజారోహణమే ప్రథమము.
తదుపరి తైలాభ్యంగన, ఛత్రచామర,
పాదుకా స్వీకరణ, దమనేన బ్రహ్మపూజన,
సర్వాపత్శాంతికర  మహాశాంత్యాచరణ,
నింబ పుష్ప భక్షణము,
పంచాంగశ్రవణము,
ప్రపాదాన ప్రారంభము,
రాజ, స్నేహ దర్శనము, దశమము వాసంత నవరాత్రారంభ పూజనము.

ఆవుపేడతో కళ్ళాపి జల్లి,
చక్కని రంగవల్లులు తీర్చి,
గుమ్మాలకు చూతపత్ర తోరణమమర్చి,
సకల దేవతలనారాధించి, నింబపుష్ప భక్షణ చేయవలె.
వేపపువ్వు పచ్చడి తినవలె.
నింబ వృక్షమన ఉత్తమ వృక్షము
బహువిధ వైద్యగుణ భరితము నింబము.
నింబ కుసుమ కిసలయ భక్షణ
రక్షించును మన దేహమును
బహువిధ రోగాదులనుండి.
వేపచెట్టు గాలి పూర్తి ఆక్సిజనేసుమా!

తీపి, పులుపు, వగరు, చేదు, కారం, ఉప్పు
రుచుల కలయికే, ఉగాది పచ్చడి ప్రత్యేకం.
శరీరానికారోగ్యప్రదం.
రసనేంద్రియ నిగ్రహమే అవసరం. అన్ని రుచులు ఆస్వాదనీయములె.
షడ్రుచుల సమ్మేళన వలెనే,
కష్టసుఖాలను, మంచిచెడులను,
అన్నిటినీ సమపాళ్ళలోనె గ్రహియించవలె, సమానముగ భావించవలె.

త్రిగుణాలను నిగ్రహించుచు, సత్వమునే పెంపొందించవలె.
వసంత కాలపు ఆనందం
మన జీవితమంతా నిండవలె.

భూతదయే మన కర్తవ్యమని
ప్రపాదానమును చేయవలె.
చలివేంద్రము లేర్పరచవలె.
ఎండ తీవ్రతను తట్టుకొనుటకై
ఛత్ర, పాదుకల దానమీవలె.
వసంత నవరాత్ర పూజనమున
శ్రీరామచంద్రునారాధించవలె.

అన్నిటికంటె మిన్నగ తప్పక పంచాంగ పూజనము, పంచాంగ శ్రవణము చేయగావలె.
పంచాంగశ్రవణము కలిగించును
మనకెంతో హితమును.
తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములె -
పంచాంగములని పిలువబడు.
తిథిపూజ వలన సంపద,
దీర్ఘాయువు వారమునను,
నక్షత్ర పూజతొ పాపవిముక్తి,
యోగమున నారోగ్యము,
కార్యజయము కరణమున,
సమకూరునని శాస్త్ర వచనము.

భక్తి ఙ్ఞాన వైరాగ్య కుసుమ శుభ సౌరభమున,
మనసు గుబాళించవలె.
ప్రతి వత్సరమీ ఉగాది నాడు
పెద్దల ఆశీర్వచనములన్,
హితైషుల అభినందనలన్
తప్పక మనమూ పొందవలె.
శుభకార్యముల చేపట్టవలె.
సౌఖ్యముగా జీవించవలె.

వికారి వెళ్ళి, వస్తోంది శార్వరి.
వికారి వత్సరము చివరన జూపెను వికారము.
కరోనా పేరున కార్చిచ్చు రగిలించె,
ప్రాణ భయముతో మనిషిని గదిలోన బంధించి,
విశ్వ మానవ జాతి ఐక్యతను పెంచె.

అద్య అడుగిడిన శార్వరి శృణాతి శార్వరియా? హింసించునా జనుల చంపివేసి ?
శర్వుని శార్వరియై రక్షించునా మనల నాదుకొనుచు !!
చూడగావలె,
పరమేశి కృపను గోరి
ప్రార్ధనలు చేసి మన్నింప వేడుకొనగ
కరుణ కలగదా తల్లికి తనయులందు !!

🙏🙏🙏🙏🙏
 జై హింద్. జై జగన్మాత
🙏🙏🙏🙏🙏

రచన::
డా.విశాలాక్షి.

Corona Virus...Dr Visalakshi

శ్రీ రామ జయ రామ జయజయ రామ.

            కరోనా వైరస్.
            - - - - - - - - - -
'శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు', అంటారు.
'మనం ఏది చేశామో దాని ఫలితాన్ని పొందుతాము' అంటారు.
కాల గమనంలో ఏమి జరగబోతోందో మన బ్రహ్మంగారు, మరియు నోష్ట్రాడమస్ లాంటి వారు వివరించారు. సామూహికంగా వచ్చే ఉపద్రవాలకు సామూహికంగా జనులు బలౌతారు. వారు తప్పు చేశారా, ఒప్పు చేశారా, అనే దానితో సంబంధం ఉంటుందా? ఉండదా?? అనేది కూడా ఆలోచించాల్సిన అంశమే.

మన పెద్దవారు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు - "ఏది జరిగినా మన మంచికే" అనుకోమని.

మనకు జీవితంలో చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది - మనకు ఇంత బాధ కలుగుతుంటే, అంతా మన మంచికే అని ఎలా అనుకోవాలి? అని. కానీ తాత్వికంగా ఆలోచిస్తే, నిజమేననిపిస్తుంది.

ప్రస్తుత సమస్య అయిన కరొనా వైరస్ కూడా అలాంటిదే! మొత్తం మానవాళినంతనూ భయాందోళనలకు గురిచేస్తూ, భయభ్రాంతులను చేస్తున్న, మానవులందరినీ అప్రమత్తులను చేస్తున్న కరోనా వైరస్ వల్ల మంచి జరగటమేమిటి ? అని ఆలోచిస్తే, పరమాత్మ ఏది చేసినా, దానికి ఒక ప్రయోజనం ఉంటుంది అని తెలుస్తుంది. సంఘటనలనేవి మనం చేస్తేనే జరుగుతున్నాయి కనుక  వాటికి మనమే బాధ్యత వహించాలని గ్రహించాలి.

ఒకప్పుడు భూభాగం మొత్తం ఏకచ్ఛత్రాధిపత్యంగా మన భారతీయ మహారాజుల చేత పరిపాలించబడిందని మన పురాణాల వలన స్పష్టమవుతోంది. అలాంటిది, భూమంతా ముక్కలుగా విభజింపబడి, అనేక దేశాలుగా మారింది. మొన్న మొన్నటి దాకా మన దేశంలో భాగమైన అనేక భాగాలు చైనాగా, బంగ్లాదేశ్ గా, పాకిస్తాన్ మొదలైన దేశాలుగా విడి పోయాయి. పోనీ స్నేహంగా ఉంటున్నాయా, అంటే కొన్ని శతృదేశాలుగానే ప్రవర్తిస్తున్నాయి. "పోరు నష్టం, పొందు లాభం" అని చెప్తారు మన పెద్దలు. ఎవరికైనా, అందరూ కలిసి మెలిసి ఉంటేనే నిజమైన ఆనందం ఉంటుంది. కానీ, దేశాల దాకా ఎందుకు !! నేటి కాలంలో కుటుంబాలలోనే ఉండటం లేదు నిజమైన ప్రేమ.

దేశంలోని రాష్ట్రాల మధ్యన సయోధ్య ఉండటం లేదు.

సర్వ మానవాళికీ తీరని నష్టాన్ని కలిగిస్తున్న టెర్రరిజం వంటి కామన్ అంశాలపై కూడా ప్రపంచ మానవులందరూ ఏకమవటం లేదు.

కానీ మహాద్భుతంగా ఈ కరోనా వైరస్ మటుకు ప్రపంచ మానవులందరినీ దగ్గర చేసి, ఏక త్రాటి మీద నడిపిస్తోంది.

ఒక్క దేశంలో పుట్టిన ఈ మహమ్మారి వలన ప్రపంచంలో అందరికీ బాధ కలుగుతోంది.

కొత్తగా పెళ్ళై ఇంటికొచ్చిన కోడళ్ళు అత్తగారి మీద చాడీలు చెప్పుకుంటూ ఉంటే, నా మీద చాడీలు చెప్పుకోవటం కోసమైనా కోడళ్ళిద్దరూ అన్యోన్యోగా ఉంటే చాలు అనుకునే అత్తగారిలా, ఒక దేశంలో పుట్టి, అనూహ్యంగా వ్యాపిస్తున్న ఈ కరోనా వైరస్ వలన ప్రపంచంలోని ఇంచుమించుగా అన్ని దేశాలు, 157 దేశాలు ఏకమయ్యాయి. ఏ విధంగా ఈ అంటువ్యాధిని అరికట్టగలము ? ఏది దీనికి మందు ? అని ప్రపంచ దేశాలన్నీ శోధిస్తున్నాయి. ఈ శోధనల వల్ల ప్రపంచ దేశాలన్నింటికీ, మన భారత దేశము యొక్క, మన సనాతన సంప్రదాయము యొక్క, మన హైందవుల ఆచార వ్యవహారముల, ఆహారపుటలవాట్ల యొక్క, మన ఆధ్యాత్మిక, నైతిక జీవన విధానము యొక్క గొప్పదనము అర్ధమవుతున్నది. మన భారతీయులకు, మన హైందవులకు కూడా మన మహర్షులు మనకందించిన జీవన విధానము ఎంత ఘనమైనదో సంపూర్ణంగా అర్ధమవాలని కోరుకుంటున్నాను.

ఇలా ఈ కరోనా వైరస్ వ్యాపిస్తుందనిఏనాడో మన కాలజ్ఞానం చెప్పింది.

ఇప్పుడు ఇది వచ్చాక ఎప్పుడు పూర్తిగా తగ్గుతుందన్న విషయాన్ని మన జ్యోతిశ్శాస్త్ర వేత్తలు చెప్తున్నారు.

ఎలాంటి జీవన విధానం మనం పాటిస్తే, ఈ కరోనా వ్యాప్తిని అరికట్ట గలమో, ఆరోగ్యంగా మనగలమో మన మహర్షులు చెప్పారు. వాటిని పాటించి అందరమూ ఆయురారోగ్యములను పొందుదుము గాక!

ఈ కరోనా వైరస్ వలన విదేశీయులు కూడా మన హైందవ సంప్రదాయాన్ని పాటిస్తూ నమస్కారములు చేయటం ప్రారంభించారు. కరచాలనాలకు స్వస్తి చెప్పారు.

అంటును, మైల మొదలైన వాటిని ఇంట్లో కలపకూడదు, దూరంగా ఉంచి, అశౌచం పాటించాలని, శుచి, శుభ్రతలు, మడి పాటించటం మన ఆరోగ్యానికి మూలమని మన మహర్షులు చెప్పిన, మనము పాటిస్తున్న మన సంప్రదాయమైన ఆచారాలలోని వైజ్ఞానికతను, ఆరోగ్య పరిరక్షణను ఇప్పుడు మానవులందరూ గుర్తిస్తున్నారు.

బయట నుంచి ఇంటికి రాగానే, ఇంటి బైటే కాళ్ళు చేతులు కడుక్కున్నాకే ఇంట్లో అడుగు పెట్టేవాళ్ళము. చాలా కాలంగా దీనిని పాటించడం మానేశారు. ఇప్పుడు ఈ కరోనా వైరస్ వలన మానవులందరూ దీనిని పాటిస్తున్నారు.

ఈ కరోనా వలన మనవైన పసుపు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇంగువల, తులసి, అల్లం, వెల్లుల్లి యొక్క విలువలను ప్రపంచం గుర్తిస్తోంది.

మనము సర్వ దేవతా స్వరూపముగా, తల్లిగా ఆరాధించే గోమాత యొక్క గొప్పదనాన్ని ప్రపంచం గుర్తించింది. మన మహర్షులు చెప్పిన సర్వ రోగ నివారిణి అయిన పంచ గవ్య ప్రాశనము యొక్క మాహాత్మ్యం ఇప్పుడు అందరికీ అర్ధమవుతోంది. గోజలముతో, గోమయముతో చేసే మందులు కరోనా వైరస్ ను తగ్గిస్తున్నాయని గ్రహించారు. దాని కొరకు మన గోజలమును విదేశాలకు మనవారు ఎగుమతి చేస్తున్నారు.

ఎక్కడ యాగములు, హోమములు జరుగుతాయో, అక్కడ ఏ వైరస్ లు ఉండవు. దైవ శక్తి తరంగాలు పరిసరాలను పవిత్రం చేసి కాపాడతాయి. అది నేటి ఆధునిక యుగంలో కూడా భోపాల్ గాస్ ప్రమాదమప్పుడు నిరూపితమైనది.

మన పవిత్ర వేద ఘోషకు యావద్విశ్వాన్నీ రక్షించే శక్తి ఉంది. ఓంకార జపం, గాయత్రీ మంత్ర జపం, ఇతర అనేకమైన మంత్ర జపములు, శ్రీమద్రామాయణ, భారత భాగవత, శ్రీమద్భగవద్గీతా పారాయణలు, స్తోత్ర పారాయణల వల్ల రోగ నిరోధనము, రోగ మూల కారణ నిర్మూలనము సాధ్యమవుతుందని మనకు తెలిసిన సత్యాన్ని ప్రపంచ ప్రజలు గుర్తిస్తున్నారు.

ఈ విధంగా ప్రపంచ దేశాల్లో మన దేశము యొక్క గొప్పదనానికి గుర్తింపు పెరుగుతోంది.  అత్యంత గౌరవనీయులైన మన ప్రధాని గారు  ఆత్మీయతతో మన ఇరుగు పొరుగు దేశాల వారితో స్పందించిన తీరు మన శతృ దేశాలను మిత్ర దేశాలుగా పరిగణింప జేస్తోంది. దేశ సరిహద్దులలో గొడవలు మరచి, టెర్రరిజమనే మాటను విస్మరించి, విదేశీయులు స్నేహము చూపిస్తున్నారు. మన దేశంలో కుల మత వర్ణ వర్గ విభేదాలు మరచి ప్రజలందరూ ఒకే లక్ష్యమైన కరోనా నిర్మూలనకు కంకణ ధారులయ్యారు.

ఈర్ష్యా  ద్వేషము, అసూయలవంటి వాటిని పక్కన పెట్టి ప్రపంచ మానవులందరి సంక్షేమం కోసం అందరూ కృషి చెయ్యాలి.
మనను శతృ దేశంగా భావించే దేశస్థులందరూ శతృత్వం మరచి, మనతో మైత్రీ బంధాన్ని పాటించాలి.

ఇప్పటికైనా మన భారతీయులకు పాశ్చాత్య వ్యామోహం తగ్గి, వారిని, వారి పద్ధతులను అనుకరించటం మాని, మన సనాతన ధర్మము యొక్క గొప్పదనాన్ని గుర్తించి, ఆచరించటం పారారంభించాలి.

విశ్వంలో అణువణువునా  ఆవరించి ఉన్న పరమాత్మ శక్తిని ధ్యానిస్తే, ఆ చిచ్ఛక్తి  ముందు ఈ కరోనా శక్తి ఎంత? అటువంటి దృఢమైన  నమ్మకం కలగాలి. దానికి మనందరి మనస్సులు విశాలమై, పరిశుద్ధమై, భక్తి భావ భరితమై ఉండాలి.

ఎందరో భక్తులు భక్తితో పరమాత్మను సేవించి, పరమాత్మ కధలు విని, పరమాత్మను స్తోత్రించి, ఎన్నో క్లిష్టమైన సమస్యల నుంచి ముక్తులయ్యరు, తరించారు.

కరోనా వైరస్ తో పోరాటంలో ఏకమైన మానవులందరూ పరస్పరము ఆత్మీయ భావనను పెంపొందించుకుని, భగవద్భక్తిని పెంచుకుని, ఆరోగ్యకరమైన ఆహారవిహారాలతో, శారీరక వ్యాయామాదులు చేస్తూ, ప్రాణాయామము చేస్తూ, సూర్య నమస్కారములు చేస్తూ, యోగాసనాలు వేస్తూ, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలనీ, సహనము, ప్రేమ, త్యాగము, సర్వ మానవ సౌభ్రాతృత్వము వంటి విశాల భావాలు పెంపొందించుకుని, సర్వ మానవ సంక్షేమం కోరుతూ జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని కోరుకుంటూ, అలా అనుగ్రహించమని సాంబసదాశివుని ప్రార్ధిస్తున్నాను.

ప్రపంచ మానవులందరూ పరస్పరం గౌరవ మర్యాదలతో మెలగుతూ విశ్వ శాంతిని వర్ధిల్ల జేయాలి.

"సర్వే జనాస్సుఖినో భవన్తు
సర్వే సన్తు నిరామయాః!
సర్వే భద్రాణి పశ్యన్తు
మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ "!!
ఓం శాన్తిశ్శాన్తిశ్శాన్తిః.

నమశ్శివాయై చ నమశ్శివాయ.
🙏🙏🙏🙏🙏

డా.విశాలాక్షి.