Sunday, February 14, 2021

Sankaranthi Celebrations --Dr Visalakshi

 సంక్రాంతి  సంబరాలు        

------------------------------


 అది ఒక పల్లెటూరు. 

హరిత శోభిత సుందర సీమ

సంక్రాంతికి రమ్మని పిలువనంప 

మనమందరమేగితి మచటి కిప్పుడే ! 

పొగబండి దిగగానే,  ఎదురొచ్చి తెగమెచ్చి

రెండెడ్ల బండిలో నెక్కించుకొనగ,

ఇటు నటుడు జూచుచు 

నబ్బుర పడుచుండ

సాగుచుండెను బళ్లు వరి చేలమధ్య. 

 

నా బాల్యపు రోజులు మెదిలె మదిలో ! 

నేలను దుక్కి దున్ని వరి నాట్లిడి, 

వరి మళ్ళలోపలన్ కలుపును తీసి

పండిన పంటంత చక్కగ తెగ కోసి, 

వరి రాశిగా పోసి, కుప్ప నూర్చి,

ధాన్యరాశులు గృహమ్ముల చేర, 

నపార సంతసమ్మొప్పగ,

ధాన్యరాశి కడు నేరిమి రోళ్ళ నింపి,  

రోకళ్ళతొ చక్కగ పోటు పెట్టి,

జవరాండ్రు దంచెదరు, చెరిగి పోసెదరు, 

తాల్చెదరింకను నేమిపోసెదర్.

జల్లెడ త్రిప్పుచు తౌడు నూకలన్ వేర్పరచి,

నల్కలనేరి యేరి, తిత్తిరీలను తెగ తీసి, 

పరిశుభ్రము చేసి,  బంగరు బియ్యము కుప్ప చేసి, 

నింపెదరు సంచుల నిండుగ 

బియ్యమియ్యెడన్.


మరి నేడు  - 

ఈ పనులన్నియు చేయును యంత్ర రాజులే !! 


మా ఎడ్ల బండి పయనము కడు రమ్యము మాకు నిపుడు, 

పరికించుచు చనుచుంటిమి.


కళ్ళాపు జల్లి యలికిన ఇంటి వాకిళ్ళ యందు

తరుణీమణులెలదిశలన్

ముత్యాల ముగ్గులు వేసిరి, 

మనోహరమగు రంగులతో 

తీర్చిదిద్దిరధికోత్సుకతోన్.


గోమయమ్ముతోడ గొబ్బెమ్మలను చేసి, 

రంగవల్లుల మధ్య వాటి నుంచి, 

పసుపు కుంకుమ చల్లి, పూలతో పూజించి,  

వాటి చుట్టు రేగిపండ్లు వైచి, 

చెరుకు ముక్కల తోడు బంతిపూవుల తోడ

నలరారు గొబ్బిదేవుళ్ళ కారతిత్తురు - కావుము చల్లగ మమ్ము దీవించుమనుచు.


కురుచగు నెద్దుదెచ్చి, కడు చక్కగ శిక్షణనిచ్చి , తలనూపుట, కాళ్ళనెత్తి నర్తించుట నేర్పి, 

కాళ్ళకు గజ్జెలు కట్టి, 

కొమ్ములకు, మెడకును భూషణమ్ముల నమరించి, 

మూపుపై శాల్వలు కప్పి, 

చిత్రపు రంగు వస్త్రములు మేన నమర్చి, 

గంగిరెద్దును కడు శ్రధ్ధ జేసి, 

డోలు వాయించుచు, బాకా నూదుచు, వీధుల ద్రిప్పుచుండ,  

డూడూ డూడూ బసవన్నా! యన

తల యూచుచు చిత్రపు చేష్టలం జేయు బసవన్నను గని, 

జనులాదరమొప్ప 

నూతన, పురాతన వస్త్ర జాలముల్ మెండుగ కప్పి, 

గంగెద్దుల వానికిత్తురు విత్తమాసక్తి తోడ, 

ప్రణుతింతురు బసవని, 

నిక్కము ఈశ్వరుడే గద వృషభ రాజగున్.!! 


అంబ పలుకు జగదంబ పలుకు ననుచును,

చేత డమరుకమూని 

జోస్యంబు చెప్ప నరుదెంచె 

బుడబుక్కలవాడొకండు, 

హరిలొ రంగ హరీ హరిలొ రంగ హరీ యనుచు, 

చిందులిడు సాతానిజియ్యరొకడు ఇంటింటి ముంగిట నిలచినాడు.

తలపైన నొక రాగి అక్షయ పాత్రతో,

కాలికి ఘల్లుఘల్లను గజ్జెలను కట్టి,

రెండు చేతులలోన చిరుతలను పట్టుకొని, 

శ్రీ హరి కీర్తించు హరిదాసు వచ్చె !! 

చూడనీశ్వరు దలపించు రూపమునను, 

నుదుట విభూతి రేఖల నలదుకొనిన, 

చేత శంఖము పూని, ఓంకార ధ్వని తోడ, 

హరహర నాదమ్ము చేయు జంగమ దేవ రొకడు - అదిగొ, కనుము.

ఇంటికి చేరిన అతిథుల నెంతో ఆదరమున, స్వాగతించి, గారవించి, 

ప్రత్యేక పిండివంటల, 

షడ్రసోపేత భోజనము పెట్ట, 

మది తుష్టి చెందితిమి మేమందరమున్.


సంక్రాంతికి కొలువగావలె బొమ్మల రూపున సర్వ దేవతల ననియెడి భావనా పటిమ, 

భామినులందరు వేడ్కతోడ, 

కడు నేర్పరులై అమర్చిరి 

బొమ్మల కొల్వులు, 

గృహాగతు లచ్చెరు వొందగ సుందరంబుగన్.

కలియుగమందు నీ బొమ్మల కొల్వున కారతిచ్చి, 

పసిపిల్లల కింపుగ తీపి పెట్ట

వంశమ్మభివృధ్ధి చెందునని, 

బ్రహ్మయె చెప్పె, మహీపతి కెప్పుడొ కూర్మి తోడుతన్.


భోగిమంటలు, కోళ్ల పందాల్, 

ఎనుముపోతుల పోరు హోరులు

చెప్పదరమే, బహువిశేషాల్.

మూడు రోజుల పండగిది

బహు ముచ్చటైనది, ముఖ్యమైనది. 

పెద్ద పండగ ఆంధ్ర జనులకు

ప్రకృతి మాత - మానవాళి - జంతు తతికి - ఉన్న బంధం

చాటి చెప్పే గొప్ప పండగ. 

హైందవోత్కర్ష తెలిపే 

సంక్రమణ పండగ - సంక్రాంతి - నవ్య సంక్రాంతి పండుగ. 


 జై హంద్.

----------------------------------------


రచన :


డా.టి(ఎస్)విశాలాక్షి.

భర్తృహరి నీతి శతకము పరిచయము. Dr Visalakshi Batruhari Neeti satkam-Introduction

 భర్తృహరి నీతి శతకము పరిచయము. 

-------------------------------------

సంస్కృత, ఆంధ్ర వాఙ్మయములలో గద్యము, పద్యము, నాటకము, చంపూ మొదలైన అనేక సాహితీ ప్రక్రియలున్నాయి. వాటిలో శతక సాహిత్యము కూడా అత్యంత విస్తారమైనది. 

శతకము అనగా వంద పద్యాలతో రచింపబడిన ఒక సాహితీ ప్రక్రియ. శతకములో ప్రతి పద్యానికీ చివరలో ఒక పదము గానీ, కొన్ని పదములుగానీ, లేక పూర్తి చరణము గానీ ఒకేలా ఉండటం ఆనవాయితీ. దీనిని మకుటము అంటారు. ఆంధ్ర శతకములో ఈ పద్ధతి అధికంగా గోచరిస్తుంది. ఉదాహరణకు 'విశ్వదాభిరామ వినురవేమ' అనునది వేమన శతకము నకు మకుటము. అలాగే 'సుమతీ' అనునది సుమతీ శతకమునకు మకుటము. అదే విధముగా కృష్ణా అనునది కృష్ణ శతకమునకు మకుటము. అలాగే 'శ్రీకాళహస్తీశ్వరా' , 'దాశరథీ కరుణా పయోనిధీ,' 'వేంకటేశ్వరా' ! 'గువ్వలచెన్నా' 'కుమారీ' 'కుమారా' మొదలైనవి ఆయా శతకములకు మకుటములు. కొన్ని శతకములు మకుటము లేకపోయినా, వంద శ్లోకములు లేక పద్యములు రచింపబడటము వలన, ఇతర శతక లక్షణములను కలిగి ఉండటము వలన శతకములని వ్యవహరింపబడతాయి. 


ఒక కావ్యము కానీ ఇతర సాహిత్య గ్రంథమును దేనినైనా తీసుకుంటే, వాటిలో మొదటి నుంచి చివరి దాకా ఒక కథ ఉంటుంది. లేక ఒక అంశానికి సంబంధించి ప్రతి పద్యానికీ అనుబంధం ఉంటూ చెప్పబడుతుంది. కానీ శతకములలోని పద్యములు అలా కాదు. కవి ఒక అంశాన్ని ఎంచుకుని శతకములోని అన్ని పద్యములలోను ఆ అంశమును బోధించునట్లు రచించినా ప్రతి పద్యము దేనికదే పరిపూర్ణమైన ఒక భావాన్ని గురించి చెప్తుంది. ఏ పద్యానికాపద్యం విడిగా ఉంటుంది. చక్కని నీతిని బోధించటమో, సంఘములోని అంశాలను తెలియజెయ్యటం, ఒక దైవము గురించి ప్రస్తావించటమో ఉంటుంది. అందుకే శతకాలు సామాన్య ప్రజానీకంలో ఎంతో ఆదరణను పొందాయి. తెలుగులో సుమతీ శతకము, వేమన శతకము, శ్రీకాళహస్తీశ్వర శతకము, శ్రీకృష్ణ శతకము మొదలైన ఎన్నో శతకాలు జనాదరణ పొందాయి. సంస్కృత శతకములలో భర్తృహరి రచించిన నీతి శతకము విశేష జనాదరణ పొందిన గ్రంథము. 


శతకానికుండ వలసిన లక్షణాలను ముఖ్యంగా ఐదింటిని పేర్కొన వచ్చును. అవి. 1. సంఖ్యా నియమము, 2. మకుట నియమము, 3. వృత్త నియమము, 4. రస నియమము, 5. భాషా నియమము.

శతకములో ఒక రసము ప్రధానమైనచో, ఇంక ఆ శతకములోని పద్యాలన్నీ అదే రసమును పోషిస్తాయి. ఇతర రసముల ప్రయోగ ముండారాదని నియమము. అలా ఆయా రస ప్రధానమైన శతకములెన్నో ఉన్నాయి. రస నియమముల ననుసరించి వెలువడిన శతకములలో  ముఖ్యమైనవాటిలో కొన్ని - భక్తి శతము, శృంగార శతకము, నీతి శతకము, వైరాగ్య శతకము, వేదాంత శతకము, హాస్య శతకము, కథా శతకము, సమస్యా శతకము, మొదలగునవి.


సంస్కృత భాషా ప్రాచీన కవులలో విఖ్యాతి గాంచిన భర్తృహరి సంస్కృత శతక కర్తలలో పేరెన్నికగన్నవారు. ఆయన శతక త్రిశతి కర్త. శృంగార శతకము, నీతి శతకము, వైరాగ్య శతకము అను శతక త్రయమును రచించారు. ఈ మూడింటిని కలిపి ఒక లఘుకావ్యముగా చెప్తారు. ఆయన ఇతర రచనలు చేసినారు. 


ఈ కవి తన గ్రంథములలో ఎక్కడా తన జీవిత కాలమును గూర్చి తెలియ జేయలేదు.  

ఆయన జీవితములోని కొన్ని సంఘటనలు  మాత్రము కథల రూపమున అనుశ్రుతముగా తెలియవచ్చుచున్నవి. 


భర్తృహరి ఉజ్జయినీ రాజ వంశస్థుడనియు, రాజు కావలసినవాడు, తన భార్య దుశ్శీలముచే సంసారమును రోసి, రాజ్యమును తన తమ్ముడగు విక్రమార్కున కప్పగించి తాను వానప్రస్థుడయ్యెనని ఒక ప్రతీతి ఉన్నది. ఈ విక్రమార్కుడే విక్రమ శకాబ్దమునకు మూల పురుషుడు. వరరుచి, విక్రమార్కుడు, భట్టి, భర్తృహరులు సోదరులని చెప్పుదురు. 


భర్తృహరి జీవితమును గురించి కాలమును గురించి అనేక కథలు ప్రచారములో నున్నాయి. ఇదియే సత్యమని ఎవ్వరూ రూఢి పరచలేదు. భర్తృహరి ఒక మహారాజు అని, ఇహపర సౌఖ్యములను విడిచి విరాగియై సన్యాసమును స్వీకరించినాడని, గొప్ప విద్వాంసుడనీ, కవి అనీ, యోగి అనీ మటుకు తెలియుచున్నది. ఆయన రచనలు లోకోపకారకములయి, చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి,ఆయనకు అఖండ కీర్తి నార్జించి పెట్టాయి. 


బహుళ ప్రచారము పొందిన భర్తృహరి శతకములను మహాబలుడు, ఆవంచ రామచంద్ర బుధేంద్రుడు, ధనసారుడు, రామర్షి, గుణవినయుడు, మీననాథుడు, ఇంద్రజిత్తుడు మొదలగు వారు వ్యాఖ్యానించినారు. వారిలో రామచంద్ర బుధేంద్రుడు రచించిన వ్యాఖ్య ఆంధ్ర దేశముననే గాక, యావద్భారతమున వ్యాప్తిలో ఉన్నది. ఆయన పీఠికలో - 


విప్రేణా భూతపూర్వం ఫలమధి తపసాలంభి సూర్యప్రసాదా

ల్లబ్ధ్వా తస్మాత్ స్వయం తత్ప్ర చురతరజరా పఞ్చతా కుఞ్చనాఢ్యమ్ ! 

హిత్వా మోహం స్వకాన్తా స్వతి విమల ధియా తం నిషే వ్యాప్తభవ్యో

యోగీన్ద్రో భర్తృహర్యాహ్వయ ఇహ కురుతే ౽ ద్యాపి విద్యా విలాసమ్.”


అను శ్లోకమున ఈ విషయము ప్రస్తావించ బడింది. 

"ఒకానొక బ్రాహ్మణుడు తనకు సూర్యప్రసాదముచే లభించిన ఫలమును తన ప్రభువగు భర్తృహరికి ఇచ్చారు. ఆ ఫలమును భుజించినవారు జరా, రోగములు లేక యౌవనవంతులుగా ఉంటారు. ఆ ఫలమును భర్తృహరి తనకత్యంత ప్రియమైన తన భార్యకు ఇచ్చారు. ఆమె దానిని తాను భుజించక, తన జారునకు ఇచ్చింది. అతడు దానిని తన మరో ప్రియురాలికి అర్పించెననియు, ఆమె దేశాన్ని పరిపాలించే ప్రభువనే భక్తి భావముతో ఆ ఫలమును భర్తృహరికి సమర్పించెననియు, ఆ విధముగా తనకు అనుగ్రహించ బడిన ఫలము తన వద్దకే వచ్చి చేరింది. ఈ సంగతి తెలిసినంతనే రాజు లోక వృత్తముపై అసహ్యించుకొని, విరాగియై అడవులకు జేరెను."  

   

భర్తృహరి తన వైరాగ్య శతక ప్రారంభమున ఈ విషయమును ప్రస్తావించారు. 


"యాం చింతయామి సతతం మయి సా విరక్తా 

సాప్యన్యమిచ్ఛతి జనం స జనోన్యసక్తః ! 

తస్మిన్ కృతే చ పరితుష్యతి కాచిదన్యా 

ధిక్తాం చ తం చ మదనం చ ఇమాం చ మాం చ"!! 

   

ఎవరిని నేను నిత్యము స్మరిస్తానో, ఆమె నాయందు విరక్తితో ఉన్నది. ఆమె వేరొకరిని ఇష్టపడుతుంది. అతనికి మరొక స్త్రీ అంటే ఇష్టం. ఆమెకు అతనియందనురక్తి లేదు. ఆమె మరొకరిని అభిమానిస్తుంది. ఛీ! ఆమెను, అతనిని, మదనుని, ఈమెను, నన్ను నేను గర్హించుచున్నాను." 


భర్తృహరి తన శృంగార శతకములో తరుణ వయస్కుల మనస్సులలో ఎటువంటి భావములు కలిగి నుద్రేకింపజేయునో, అవి యే విధంగా మనస్సును కలచివైచి శాంతిని దూరము చేయునో అటువంటి కామాదికములను గురించి ప్రస్తావించారు. 


భర్తృహరి వైరాగ్య శతకము వేదాంత సిద్ధాంతమును ప్రతిఫలింపజేయుచుండును. తృష్ణాచ్ఛేదన మావశ్యకమనియు, ఐహిక బంధమునకు మూలము లోభము కనుక కామక్రోధాది అరిషడ్వర్గాలను జయించాలని బోధించారు. ప్రపంచములోని సర్వము తాత్కాలికములేనని గ్రహించి, నిత్యానిత్య వివేకముతో వైరాగ్యము పొంది సుఖించాలని బోధించారు. 


"భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం, 

మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం ! 

శాస్త్రే వాద భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాద్భయం, 

సర్వం వస్తు భయన్వితం భువి నృణాం వైరాగ్య మేవా భయమ్"!!


భర్తృహరి తన నీతి శతకములో సర్వ మానవాళికీ అనేక విధములుగా నీతిని బోధించారు. మానవులందరికీ ఉపకరించే విద్య, ధనము, ధైర్యము, ఆత్మ గౌరవము మొదలైన అనేక అంశాలను వివరించారు. ఆయన నీతి శతకమును పది పద్ధతుల క్రింద విభజించారు. ప్రతి పద్ధతిలోను పది శ్లోకాలు చొప్పున ఉన్నాయి. అవి -

1. మూర్ఖ పద్ధతి 

2. విద్వత్ పద్ధతి

3. మానశౌర్య పద్ధతి

4. అర్ధ పద్ధతి

5. దుర్జన పద్ధతి

6. సుజన పద్ధతి

7. పరోపకార పద్ధతి

8. ధైర్య పద్ధతి

9. దైవ పద్ధతి

10. కర్మ పద్ధతి.


భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులోనికి అనేకులు అనువదించారు. ఆ కవులలో ఎలకూచి బాలసరస్వతి, ఏనుగు లక్ష్మణ కవి, పుష్పగిరి తిమ్మన అను ముగ్గురు ముఖ్యులు. వీరిలో ఏనుగు లక్ష్మణ కవి అనువాదము విస్తృత ప్రచారములో నున్నది. ఈయన ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. ఈయన వంశములోని పూర్వీకులైన జలపాల మంత్రి గారు తూర్పు గోదావరి జిల్లా సంస్థానాధీశ్వరుల వద్ద ఏనుగులను బహుమతిగా పొందటం చేత వీరి పూర్వీకుల ఇంటిపేరు స్థానములో ఏనుగు చేర్చబడి వ్యవహరింప బడుతున్నది. ఏనుగు లక్ష్మణ కవి రామేశ్వర మాహాత్మ్యము, విశ్వామిత్ర చరిత్రము, శ్రీ సూర్య శతకము మున్నగు రచనలను కూడా చేశారు.


భర్తృహరి రచించిన, ఏనుగు లక్ష్మణ కవి చేత అనువదింపబడిన నీతి శతకమును అధ్యయనము చేద్దాము.


🙏🌹

డా.విశాలాక్షి.

Hindu gods Idols being destroyed in Andra pradesh -Dr Visalakshi

 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్రీ రామ జయ రామ జయజయ రామ! 

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ! 

సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే!! 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


మన భారత దేశ చరిత్రలో మన దైవ విగ్రహాల మీద, దేవాలయాల మీద అనేక మార్లు దండయాత్రలు జరిగాయి, వేలాది ఆలయాలు నేల కూల్చబడ్డాయి, దైవ విగ్రహాలు ముక్కలు చెయ్యబడ్డాయి. ఎన్నో ఆలయాలు శిథిలం కావించబడ్డాయి. దైవ విగ్రహాల తలలు, కాళ్ళు, చేతులు ముక్కలుగా నరక బడ్డాయి. వాటిని సందర్శించినప్పుడు, ఆ సంఘటనల గురించి చదివి నప్పుడు, విన్నప్పుడు మన రక్తం సలసల మరిగేది, బాధతో హృదయం ద్రవించేది. ఎవ్వరికీ ఎప్పుడూ ఏ హానీ చెయ్యని, సర్వ మానవ శ్రేయస్సును కాంక్షించే, "వసుధైక కుటుంబ" భావనతో జీవించే మా హైందవుల మీద ఈ దాడులేమిటి? అని మనస్సు ఆక్రోశించేది. మేమే కనక ఆ కాలంలో ఉంటే ఆ దుర్మార్గులను కత్తికో కండగా నరికే వాళ్ళము అనే మాటలను విని, వారి ఆర్తి మన హృదయాలలో ఆర్తిగా జ్వలిస్తుండగా ఆ కాలంలో మన దైవాలను, ఆలయాలను, మన ధర్మాన్ని రక్షించినవారికి, రక్షించటంలో అసువులు బాసి తరించిన వారికి భక్తితో నివాళులర్పించాము. *ఎందరో భక్తులు మన దైవ విగ్రహాల రక్షణలో, దేవాలయాల పరి రక్షణలో ప్రాణాలను త్యాగం చేశారు. ఎందరో మన దైవ విగ్రహాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, తరువాత పునః ప్రతిష్ఠించి, మన దైవాలను మనకందించి, ఆరాధించటం ప్రారంభించారు. శ్రీమతి రాణి అహల్యాబాయి లాంటివారు కాశీ విశ్వనాథాలయం వంటి ఎన్నో దివ్య క్షేత్రాలను పునరుద్ధరించారు. ఎంతమంది దుర్మార్గులైన విమతస్థులు మన మతానికి, మన ధర్మానికి, మన దైవాలకు ద్రోహం చేస్తున్నా, మనం - మన పూర్వీకులు ఎంతో నిష్ఠతో మన దైవ విగ్రహాలను, దేవాలయాలను పరిరక్షిస్తూ, పునరుద్ధరిస్తూ వస్తున్నారు. 

ఇదంతా తురుష్కుల దండయాత్రలప్పుడు, వారు మన దేశమును పరిపాలించే టప్పుడు జరిగాయి. రత్నగర్భగా పేరు గాంచి, జ్ఞానముతో, సంపదలతో, భోగభాగ్యాలతో, గొప్ప సంస్కృతితో విలసిల్లే మన సంస్కృతిని నశింపజెయ్యాలనీ, మన రత్నరాశులను కొల్లగొట్టాలనీ, మన జ్ఞానరాశికి మూలమైన తాళపత్ర గ్రంథాలను నశింపజెయ్యటానికి, మన దైవం మీద మనకున్న భక్తి శ్రద్ధలను సన్నగిల్ల జెయ్యటానికి ఆ దాడులు, ఘాతుకాలు, కిరాతకాలు జరిగాయి. 


కానీ నేటి ఈ ఆధునిక యుగంలో, మన భారత దేశానికి పరాయి పాలన నుంచి విముక్తి లభించి, స్వాతంత్య్ర లభించాక, మనమే మనను పాలించుకుంటున్నప్పుడు ఇటువంటి అమానుష కృత్యాలు జరగటమేమిటి? దానిని మన ప్రభుత్వాలు తీవ్రంగా ఖండించి, ద్రోహులను శిక్షించక పోవటమేమిటి? హిందూ దేశంలో, హిందువుల పాలనలో, హిందూ ధర్మానికి, హిందూ మతానికి, హిందూ దైవాలకు రక్షణ లేకపోవటమేమిటి ? ఈ మధ్య కాలంలోనే విపరీతంగా దాడులు జరగటమేమిటి? ఎవరు చేస్తున్నారో తెలుసుకుని శిక్షించలేకపోవటమేమిటి ? తప్పు చేసినవారెవరో తెలిసి కూడా వారిని వదలటం, అమాయకులను శిక్షించటం కూడా కొన్ని సార్లు జరుగుతోంది. ఇదెంత పాప కృత్యమో కదా ! ఈ మధ్యనే మన దేశంలోని విజయవాడలో, పిఠాపురం మొదలైన వివిధ ప్రాంతాల్లో అనేక దైవ విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి, ఆలయాలు నేల కూల్చబడ్డాయి. ఆ సమయంలో భక్తులైన, ఆస్తికులైన హైందవుల హృదయాలు బాధతో విలవిలలాడాయి. మనమందరమూ ఎంతో బాధ పడ్డాము. ప్రభుత్వం ఆ దుర్మార్గులను శిక్షించి, మన ఆలయాలను, దైవ విగ్రహాలను రక్షించాలని, మన ధర్మానికి న్యాయం చెయ్యాలనీ, చేస్తారనీ ఆశించాము. మన వాళ్ళు కొందరు వెళ్ళి చూసి, అయ్యో అన్నారే కానీ దుష్టులను శిక్షించటానికి ఏ చర్యా చేపట్టలేదు. 


ఇప్పుడు మనందరికీ ఆరాధ్య దైవము, ఆదర్శ మూర్తి, ఆదర్శ ప్రభువు, శ్రీమద్రామాయణ స్వరూపుడు, సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు అయిన, రామతీర్థములో వెలసి, మనందరి చేత ఆరాధింపబడుతున్న, విజయనగరంలో రామ తీర్థంలో కొలువైయున్న శ్రీరామ చంద్ర మూర్తి విగ్రహాన్ని విగత శిరునిగా చేసి, మన దైవాన్ని, మన మతాన్ని, మన నమ్మకాలను ఖండిస్తున్న దుష్ట శక్తులను, దౌర్జన్యాన్ని అడ్డుకోలేకపోతే, ఆపలేకపోతే మనము హైందవులమవుతామా ? భారతీయులమవుతామా ? మానవులమవుతామా ? 


బ్రిటిష్ వాళ్ళ పాలన వల్లే మన హైందవులలో చాలా మంది మనము హైందవులమనీ, మనది సనాతన ధర్మమనీ మర్చేపోయారు. అనాది కాలం నుంచి, సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఉన్న, యావన్మానవాళికీ జ్ఞానమునిచ్చిన మన వేదములు, శాస్త్రములు, పురాణేతిహాసాది అనంత జ్ఞాన రాశిని - కనీసం ఇంతటి జ్ఞాన రాశికి, మహోన్నతమైన సభ్యత, సంస్కారములు, సంస్కృతి, నాగరికతలకు వారసులమని మర్చేపోయారు. మనకు ఎన్ని శాస్త్రములున్నాయో వాటి పేర్లైనా తెలీకుండా బ్రతికేస్తున్నాము. విదేశీయుల, విమతస్థుల ఎడతెగని దాడుల వలన, బ్రిటిష్ వారి పాలనలో మగ్గటం వలన ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయములను నిర్వహించినది, అనంతమైన శాస్త్రాలకు, లక్షల గ్రంథ రాశికి నెలవు మన భారత దేశమనీ మర్చేపోయారు మన భారతీయులు. మనము సర్వ తంత్రం స్వతంత్రంగా బ్రతికే జ్ఞాన స్వరూపులమనీ మర్చేపోయారు. బానిసత్వపు బ్రతుకులకు అలవాటైపోయి, స్వాతంత్య్రం వచ్చి డెభ్బై ఏళ్ళు దాటినా, బానిసత్వపు మనస్తత్వం పోక పరాయి దేశాలను అనుకరిస్తూ, మన ధర్మాలను, మన దైవాన్ని విస్మరిస్తున్నారు. మెకాలే మన దేశంలో ఏర్పరచిన విద్యావిధానంతో తప్పుడు చరిత్ర చదువుతూ అదే సత్యమనుకుంటూ మన గురుకుల సంప్రదాయ విద్యావిధానంలోని గొప్పదనాన్ని కనీసం ఊహించలేక పోతున్నారు.


ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని వృద్ధి పరచే జీవన విధానాన్ని విస్మరించి, దేవతార్చనలను, నైవేద్యములను పెట్టటం విసర్జించి, పీట మీద కూర్చుని, ఆరిటాకులలో దేవతలకు నివేదించిన ప్రసాదం తినకుండా, టేబుల్ మానర్స్ అంటూ, టేబుల్ మీద పెట్టుకు తింటూ, అంటూ శొంట్లను కలిపేస్తూ, అనారోగ్యాలకు బానిసలవుతున్నారు. "పరోపకారార్థమిదం శరీరమని" బ్రతికే మనం అధికార దాహంతో, స్వార్ధంతో మన మతానికి, మన ధర్మానికి, మన దేవతలకు ద్రోహం చేసేవారిని ప్రతిఘటించే ధైర్యం లేక, మనవారిలోనే కొందరు మన వారినే విమర్శిస్తుంటే చేతకానివారిలా మనస్సులో బాధ పడుతుంటే ఏం లాభం ?? దేవుడు సర్వ శక్తిమంతుడంటారుగా ! ఆలయాలను, విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే, ఆయన రక్షించుకోలేడా ? అంటూ కువిమర్శలు చేస్తారు. దైవం దృష్టిలో సర్వము సమానమే ! మంచి, చెడు సర్వము సృష్టిలో భాగమే ! కానీ "పరోపకారః పుణ్యాయ, పాపాయ పరపీడనమ్" అన్నారు. "స్వధర్మే నిధనం శ్రేయః, పరధర్మో భయావహః" అని పరమాత్మే చెప్పారు. దైవం మనకు వివేకాన్నిచ్చాడు, మనకు మన ధర్మాలను, మన బాధ్యతలను, వాటిని స్వతంత్రంగా ఆలోచించి, వివేకంతో పని చెయ్యగల శక్తిని ఇచ్చాడు. కనుక మన దైవాలను, మన ఆలయాలను, మన ధర్మాన్ని మనమే తప్పక రక్షించుకోవాలి. మన ధర్మాన్ని మనం రక్షించుకోవటానికి, దుర్మార్గాన్ని నశింపజెయ్యటానికి మనమంతా ఏకమై, సంఘటితమై, మన ధర్మరక్షణను సంకల్పం చేసి, వ్యక్తిగతంగా, సామూహికంగా దైవ ప్రార్ధనలు చెయ్యాలి. రుద్రాభిషేకాలు చెయ్యాలి. ఇష్టదేవతా నామ, మంత్ర జపం చెయ్యాలి. "శ్రీరామ జయ రామ జయజయ రామ" అనీ, "శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే !

సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే" !! అనీ లక్షల మార్లు జపించాలి. దుశ్చర్యలకు పాల్పడినవారిని ప్రభుత్వం చేత శిక్షింపచెయ్యటానికి కూడా మనమందరమూ ఏకమవాలి, దుర్మార్గాన్ని, అధర్మాన్ని ప్రతిఘటించాలి. జగద్గురువుల ఆదేశాలతో, ఆశీస్సులతో, సంకల్పంతో, వారి నేతృత్వంలో, ధర్మపీఠాధిపతుల, ధర్మ సంరక్షకుల నేతృత్వంలో మనమందరం సంఘటితమవాలి. "సంఘే శక్తిః కలౌ యుగే". సామూహికంగా దైవ ప్రార్ధనలు చేసి ఆత్మ శక్తిని పెంపొందించుకుని, దైవానుగ్రహం పొంది, మన దేవతా మూర్తులను మనమే రక్షించుకోవాలి. ఆత్మ విమర్శ లేకుండా బ్రతికే, నీతినియమాలు లేనివారు అధికారులైతే దేశానికి, ధర్మానికి, ప్రజలకు భద్రత ఏముంటుంది ? దేశభక్తి కల నాయకులకు మద్దతునివ్వాలి.


దేశానికి కానీ, ధర్మానికి కానీ, మన దైవాలకు కానీ ద్రోహం జరుగుతుంటే, అన్నింటినీ పక్కన పెట్టి, అందరూ సంఘటితమై ఎదిరించి, విజయాన్ని సాధించ వలసిన బాధ్యత ప్రతి హిందువుది, ప్రతి భారతీయునిది. ఇది అందరూ గుర్తించి ప్రవర్తింతురు గాక ! మన ఇంట్లో కనుక పొరపాటున నిప్పంటుకుంటే ఏం చేస్తాము ? ఇంట్లో ఉన్న అందరమూ మన అన్ని పనులను పక్కన పెట్టేసి, ఆ క్షణాన్నే అందరం కలిసి నీళ్ళు పోసీ, వేరే ప్రయత్నాలు చేసీ ముందు మంటలనార్పుతాము కదా ! అలాగే ఇప్పుడు మనమందరం సంఘటితమై అన్ని విధాలా ప్రయత్నించి, మన ధర్మాన్ని మనం రక్షించుకోవటానికి ఏకమవాలి. విజయం సాధించాలి. 


ఇంక భవిష్యత్తులో ఎప్పుడూ మన ధర్మం మీద, ఆలయాల మీద, దైవ విగ్రహాల మీద ఏ దాడులు జరుగకుండు గాక ! మానవులందరిలోను ధర్మతేజము వర్ధిల్లు గాక ! స్వధర్మ పాలన వృద్ధి చెందు గాక ! దైవ భక్తి, ధర్మ నిష్ఠ దృఢపడు గాక ! 

సంపూర్ణ పరివార సమేత శ్రీరామ చంద్ర మూర్తి మనలను అనుగ్రహించు గాక ! సాంబసదాశివుని అనుగ్రహం మనకు పరిపూర్ణంగా లభించు గాక ! ఉగ్ర నృసింహ స్వామి మనలనావేశించి కార్య సాఫల్యతను కలిగించు గాక ! సర్వే జనాః సుజనాః భవన్తు! సర్వే సుజనాః సుఖినో భవన్తు. 

ఓం శాన్తిశ్శాన్తిశ్శాన్తిః


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

డా.విశాలాక్షి.