Thursday, December 6, 2018

A humble request

🙏🙏🙏🌹

ఆత్మీయ పాఠకులందరికీ ప్రణామములు.

మహావాక్యముల సారమును గురించి అధ్యయనం చెయ్యటం ప్రారంభిద్దాము.

ఏ పని చెయ్యాలన్నా, ఆ పని చెయ్యాలనే, సంకల్పము, ఆ పని చెయ్యగల అర్హత, ఏ ఫలము నపేక్షించి ఆ పనిని చెయ్యాలను కుంటున్నాము అనే ప్రయోజనము ఉండాలి.

జ్ఞానార్జన, అందులోనూ ఆధ్యాత్మిక జ్ఞానార్జన చెయ్యాలంటే, దానికి తగిన అర్హత ఉండాలి.
బ్రహ్మ జ్ఞాన విచారం చెయ్యాలంటే సాధన చతుష్టయం ఉండాలని పెద్దలు చెప్తారు. సాధన చతుష్టయమంటే -

1. నిత్యానిత్య వస్తు వివేకము. ఏది నిత్యము - శాశ్వతమైనది, ఏది అనిత్యము - అశాశ్వతమైనది అనే జ్ఞానం కలిగి ఉండటము. ప్రపంచము అశాశ్వతము. కేవలము పరబ్రహ్మము శాశ్వతము

2. ఇహాముత్ర ఫల భోగ విరాగము. ఇహ - ఈ లోకములోని, అముత్ర - అర లోకము లోని - అనగా స్వర్గాది లోకములలోని భోగములను అనుభవించుట యందు వైరాగ్యము కలిగి ఉండాలి.

 3. శమదమాది షట్క సంపత్తి - శమము - అంతరింద్రియ నిగ్రహము, దమము - బాహ్యేంద్రియ నిగ్రహము, ఉపరతి - మనస్సును ప్రపంచ వృత్తుల మీద ప్రసరించకుండా నిగ్రహించటము, బాహ్యవిషయాలను చిత్తవృత్తులతో ఆశ్రయించకుండా ఉండటము, తితిక్ష - సహనము, ఓర్పు, శ్రద్ధ - శాస్త్ర వాక్యములందు, గురు వాక్యములందు నమ్మకము, సమాధానము - ఆత్మ తత్త్వము మీదే మనస్సు లగ్నమయి ఉండటము, ఏకాగ్రత కలిగి ఉండటము - అను నీ ఆరింటిని కలిగి ఉండటము.

4. ముముక్ష - ముక్తి పోందాలనే తీవ్రేచ్ఛ.

బ్రహ్మ జ్ఞానమును, ఉపనిషద్విజ్ఞానమును పొంద గోరిన వారు ముందు వీటిని కలిగి ఉండి, తరువాత సద్గురువునాశ్రయించి, ఉపదేశము ద్వారా గ్రహించ వలసిన గుహ్య విద్య - రహస్య విద్య - వేద విద్య. ఇటువంటి విద్యను అధ్యయనం చెయ్యాలి అనే కోరిక జనించటం పూర్వ జన్మ సుకృత సంస్కార విశేషం. శ్రద్ధతో, శ్రవణ, మనన, నిదిధ్యాసనముల వలన గ్రహించ వలసిన విద్య "మహావాక్యముల సారము - సర్వం ఖల్విదం బ్రహ్మ".

మనకు అనంతమైన వేదరాశిని పరమాత్మ మహర్షుల ద్వారా అందించాడు.
నాలుగు వేదాలున్నాయి.
ఋగ్వేదము, యజుర్వేదము
సామవేదము
అథర్వణ వేదము.
నాలుగు వేదములు ప్రతి ఒక్కటీ - సంహితలు, బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు అని నాలుగు భాగాలుగా చేయబడ్డాయి. ఉపనిషత్తులను వేదాంతము అంటాము. వేదముల సారము కనుక, వేదములలో చివరిలో ఉన్నాయి కనుక ఉపనిషత్తులను జ్ఞానకాండ అంటాము. మిగిలిన భాగాలను కర్మకాండ అంటాము. కర్మకాండలోనూ జ్ఞానబోధ ఉంటుంది. కానీ ఉపనిషత్తులు కేవలము బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని గురించి మాత్రమే బోధిస్తాయి. ప్రతి వేదానికి సంబంధించి ఉపనిషత్తులుంటాయి. ఉపనిషత్తులు మొత్తం పదకొండు వంద లున్నాయంటారు. వాటిలో ముఖ్యమైనవి నూట ఎనిమిది ఉపనిషత్తులు. వీటిలో అత్యంత ప్రధానమైన దశోపనిషత్తులకు జగద్గురువులు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు భాష్యములు వ్రాశారు.
అవి - ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యకోపనిషత్తులు. ఇవి కాక శ్వేతాశ్వతరోపనిషత్తు, కౌశీతకీ ఉపనిషత్తు లాంటి ఉపనిషత్తులన్నీ చాలా జ్ఞాన బోధకములే !
ఈ ఉపనిషత్తు లన్నింటిలో వేల మహావాక్య సదృశ జ్ఞాన బోధక వాక్యాలున్నాయి. కానీ నాలుగు వాక్యాలను మాత్రమే "మహావాక్యములు" అన్నారు. ఏ నాలుగు వాక్యాలను మహావాక్యములు అన్నారు అన్నది మనకు శుకరహస్యోపనిషత్తులో కనిపిస్తుంది.
ప్రతి వేదము యొక్క సారముగా ఆ వేదమునకు సంబంధించిన ఉపనిషత్తులలోని ఒక ఉపనిషత్తు నుంచి ఒక వాక్యము చొప్పున తీసుకున్నారు.
అవి -
1. ఋగ్వేదమునకు చెందిన ఐతరేయోపనిషత్తులోని ' ప్రజ్ఞానం బ్రహ్మ ',

2. యజుర్వేదమునకు సంబంధించిన బృహదారణ్యకోపనిషత్తులోని ' అహం బ్రహ్మా2స్మి ',

3. సామ  వేదాంతర్గతమగు ఛాందోగ్యోపనిషత్తులోని ' తత్త్వమసి ', మరియు

4. అథర్వణ వేదమునకు సంబంధించిన మాండూక్యోపనిషత్తులోని 'అయమాత్మా బ్రహ్మ' అనునవి.
ఈ నాలుగు మహావాక్యములు కలిసి  "సర్వం ఖల్విదం బ్రహ్మ"  అనునటు వంటి మూలాధార మహావాక్యాన్ని బోధిస్తున్నాయని నేను నా థీసిస్ లో మనవి చేశాను. అంటే ఈ యావద్విశ్వమూ బ్రహ్మమే !
"సర్వం బ్రహ్మమయం జగత్" అన్న ఒక్క సత్యాన్ని బోధించటానికి నాలుగు మహావాక్యములు, నాలుగు మహావాక్యముల సారము అర్ధమవటానికి అనేక వందల మహావాక్యములు, ఈ వాక్యాలు సారమర్ధమవటానికి సమస్త వేద వాఙ్మయము - పురాణాలు, ఇతిహాసాదులన్నీ వచ్చాయి.

నాలుగు మహావాక్యములలోను 'తత్వమసి' మహావాక్యమును సర్వోత్కృష్ట మహావాక్యముగా విజ్ఞులు పరిగణిస్తున్నారు.
'తత్త్వమసి' మహావాక్యం అర్ధమవాలంటే అత్యంత వివరంగా సోపపత్తికంగా వివరించుకోవాలి. కానీ సూక్ష్మంగా ఇలా చెప్పవచ్చు.
తత్ త్వం అసి - ఆ పరబ్రహ్మవు నీవే అయి ఉన్నావు - ఇది గురువుగారు శిష్యునికి బ్రహ్మ జ్ఞానాన్ని గురించి చేసిన ఉపదేశ వాక్యము.

నిత్యానిత్య వస్తు వివేకం కలిగి, శమదమాది షట్క సంపత్తిని సంపాదించుకుని, బ్రహ్మచర్య నిష్ఠతో, స్వాధ్యాయముతో చిత్తశుధ్ధిని, చిత్తైకాగ్రతను పొంది, ఇహాముత్ర ఫలభోగములందు విరక్తుడై, ముముక్షువు అయిన జిజ్ఞాసువు శ్రధ్ధతో గురువును ప్రార్ధించి పొందే ఉపదేశము 'తత్త్వమసి' మహావాక్యము.
'తత్' - అది - అనిర్వచనీయ పరబ్రహ్మము. 'త్వం' - నీవు అనగా జీవుడు.
'అసి' అనగా అయి ఉన్నావు. ఇది క్రియా పదము. అస్ - ఉండుట అనే ధాతువు యొక్క మధ్యమ పురుష ఏక వచన రూపము. ఆ పరమాత్మ నీవే అయి ఉన్నావు. ఆ పరబ్రహ్మ తత్త్వము నీ సహజ స్వభావము. అది నువ్వే ! అని అర్ధము. దీనిని జీవబ్రహ్మైక్య బోధక వాక్యము అంటారు. అసి అన్న క్రియా పదము ఐక్యతను తెలియజేస్తోంది. ఇక్కడ తత్ కి త్వం కి ఐక్యత చెప్పబడింది.
ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలక మహర్షి శ్వేతకేతువు అనే తన కుమారునికి అనేక ఉపపత్తులతో ఈ ఉపదేశ వాక్యాన్ని వివరించారు.
🌹🙏
ఇది చదివిన తరువాత వాయిస్ మెసేజ్ లను వినవలసినదిగా మనవి.

ధన్యవాదములు.
🙏🌹
డా.విశాలాక్షి.

No comments:

Post a Comment